ఏపిలో ఏకు మేకవుతున్న కమలం..! జగన్ కు బీజేపీతోనే ప్రమాదమంటున్న నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ కి ఏ పార్టీతోనూ పొత్తు లేదు. రాజకీయ రణక్షేత్రంలో ఒంటరి పోరుకే జగన్ ఎపుడూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన పొత్తు కోసం అనేక పార్టీలు రెడీ అయినా కూడా జగన్ ససేమిరా అనేశారు. ఇక ఏపీలో అనుకున్నట్లుగానే బంపర్ మెజారిటేతో జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్ కి ఇపుడు ఏపీలో ఎదురులేదు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ఉన్నా ఆ పార్టీ పాత్ర నామమాత్రమే. ఇక ఆ పార్టీలో బాబు తరువాత అంతటి నాయకత్వం కూడా ఎక్కడా కనిపించడంలేదు. దాంతో జగన్ కి టీడీపీ నుంచి పెద్దగా ముప్పు కనిపించడంలేదు. ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఇపుడు తామే రేపటి రోజున ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ అంటోంది. ఫిరాయింపులను ప్రోత్సహించైనా ఏపీలో పవర్లోకి రావాలన్నది బీజేపీ ఎత్తుగడ. చూడబోతే జగన్ కి బీజేపీ నుంచే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.
Recommended Video
ఏపీలో టిడిపి నామమాత్రే..! కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపితోనే వైసీపికి సమస్యలు..!!
ఎందుకంటే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మోడీ, షా మొండితనం అందరికీ తెలుసు. వారు అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఏపీలో జగన్ని కొట్టేందుకు సామదానభేద దండోపాయాలు కూడా వెతుకుతారు. దాంతో జగన్ దూరదృష్టిలో ఆలోచిస్తున్నరని అంటున్నారు. బీజేపీ కంటే టీడీపీ బెటర్ అన్నది జగన్ ఆలోచనగా ఉందిట. టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా సునాయాసంగా వైసీపీ విజయం సాధిస్తుందని వైసీపీ వ్యూహకర్తలు అంటున్నారు. బీజేపీతో తనకు ముందు ముందు ఇబ్బంది అని జగన్ కి బాగా తెలుసు. అందువల్ల ఆయన కాస్తా మెత్తగా బయటకు కనిపిస్తున్నారు. కేంద్రసాయం అవసరం అన్న ఒక్క కారణంతోనే కమలం దూకుడుని భరిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఏపీలో బీజేపీకి దారులు మూసేందుకు తన ఏర్పాట్లలో తాను ఉన్నారు. ఏపీలో ఫిరాయింపులను అడ్డుకుంటాం అని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పడం వెనక చంద్రబాబు పై ఉన్న ప్రేమ కంటే బీజేపీకి కట్టడి చేసే గట్టి వ్యూహం దాగుంది. మరి బీజేపీని కట్టడి చేయడానికి జగన్ ఏం చేస్తారో అనే అంశం ఉత్కంఠ రేపుతోంది.
ప్రతిపక్ష నేతగా బీజేపికి దగ్గరైనా జగన్..! ముఖ్యమంత్రిగా వ్యూహం ఏంటి..!!
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటైన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో ఎలా డీల్ చేయాలనే విషయంలో ఇంకా సందిగ్ధతను ఎదుర్కొంటోంది. వ్యూహాత్మక పంథాను అనుసరించి తెలుగుదేశాన్ని, బీజేపీని వేరు చేయడంలో గతంలో వైసీపీ విజయం సాధించింది. ప్రత్యేకహోదాకు తాము పోరాటం చేస్తున్నామన్న భావనను పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో టీడీపీ బోల్తా పడింది. ఆ అంశాన్ని తానే క్లెయిం చేసుకోవాలనే తొందరపాటులో కేంద్రానికి దూరమైంది. ప్రజల్లో పెద్దగా సెంటిమెంటుగా లేని అంశంతో పోరాటం చేసి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. అటు కేంద్రంలో భాగస్వామ్యం లేక ఇటు రాష్ట్రంలో అధికారం కోల్పోయి రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోయింది తెలుగుదేశం. అప్పట్లో బీజేపీ అధినాయకత్వంతో కొంత సన్నిహితంగా ఉన్నట్లుగా కనిపించింది వైసీపీ.
ఏపి అదికారం మాదే అంటున్న బీజేపి..! రాబోవు ఎన్నికల్లో కమలం వ్యూహం ఏంటి..?
నిజానికి రెండు పార్టీలు అధికారంలోకి రావడంతో రాష్ట్రప్రయోజనాలు, కేంద్ర పరిమితుల మధ్య వైరుద్ధ్యం సహజంగానే నెలకొంది. అందువల్లనే ఎలా ముందుకెళ్లాలనే విషయంలో వైసీపీ ఇంకా తర్జనభర్జనలు పడుతోంది. వైసీపీ, టీడీపీ ప్రత్యేక హోదా అన్న ఒక అంశాన్ని తీసుకుని పరస్పరం పోటీ పడ్డాయి. ప్రజలకు ఎంతమేరకు ప్రయోజనం అన్న సంగతి పక్కనపెడితే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వరకూ దారి తీసింది. 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి. నేను ప్రత్యేక హోదా తెస్తానంటూ జగన్ మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. అది ఎన్నికల వాగ్దానం గానే మిగిలిపోయే సూచనలున్నాయి.
కమలం నాడి జగన్ పట్టుకోగలరా..! కాషాయ పార్టీని ఎలా కట్టడి చేస్తారు..?
కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ లోని లోక్ సభ సభ్యుల సంఖ్యాబలంతో అవసరం లేదు. రాజ్యసభకు సంబంధించి తెలుగుదేశం సభ్యులు నలుగురు బీజేపీలో చేరిపోయారు. అందువల్ల జగన్ ఎంతగా మొరపెట్టుకున్నప్పటికీ అరణ్యరోదనగానే మిగిలిపోతుంది. అయితే జగన్ పదేపదే ఆ అంశాన్ని ప్రస్తావిస్తే నీతి అయోగ్ వంటి ప్రధానవేదికలపై కేంద్రానికి కొంత చికాకు కలుగుతుంది. ఎక్కడైనా వెనకంజ వేస్తే రాజకీయాస్త్రాలు ఎక్కుపెట్టడానికి టీడీపీ సిద్దంగా ఉంది. ఇది ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితే. అందులోనూ జగన్ మోహన్ రెడ్డి ఎంతవరకైనా తెగించి పోరాడతారనే భావన ప్రజల్లో ఉంది. నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు నిధులు చాలా అవసరం.