ఏపీలో పొత్తులపై ఏం చేద్దాం - బీజేపీ హైకమాండ్ ఫోకస్ : రాష్ట్రానికి జేపీ నడ్డా..!!
తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో ఎన్నికలకు సిద్దమని ప్రకటించారు. పార్టీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ లక్ష్యంగా పదునైన విమర్శలతో రాజకీయ యుద్దానికి సిద్దమని ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఏపీలో భవిష్యత్ కార్యాచరణ పైన ఫోకస్ పెట్టారు. ఏపీలో కొద్ది రోజులుగా పొత్తుల పైన ప్రధానంగా చర్చ సాగుతోంది. ఏపీలో బీజేపీ కి మిత్రపక్షంగా ఉన్న జనసేన - టీడీపీతో పొత్తుకు సిద్దం అయిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
టీడీపీ - జనసేన పొత్తు ఖాయమంటూ
ఇదే సమయంలో తిరిగి జనసేన -టీడీపీ కలిసే పోటీ చేస్తున్నాయని..వాటికి సొంతంగా ఎదుర్కొనే ధైర్యం లేదంటూ వైసీపీ వ్యాఖ్యానిస్తోంది. ఏపీ బీజేపీ నేతలు మాత్రం తాము జనసేనతో పొత్తు కొనసాగిస్తున్నామని... కుటుంబ పార్టీలతో తమకు పొత్తు అవసరం లేదని చెబుున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ మత్రం అద్భుతం జరిగే అవకాశం ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో బీజేపీని సైతం ఒప్పించి... టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పటం ద్వారా పవన్ ఆలోచనలు ఏంటనేది మరింత స్పష్టత రావాల్సి ఉంది.
నడ్డా పర్యటనలో కీలక దిశా నిర్దేశం
ఇక, ఇదే సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు. జూన్ 5,6 తేదీల్లో ఏపీ నడ్డా పర్యటించనున్నారు. ప్రతీ అయిదు పోలింగ్ కేంద్రాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసుకున్న శక్తి కేంద్రాల ఇన్ ఛార్జ్ లతో నడ్డా సమావేశం కానున్నారు. 5న రాజమండ్రిలో జరిగే పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు. 6న విజయవాడలో పార్టీ కీలక నేతల సమావేశంలోనూ ఆయన పార్టీ భవిష్యత్ కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తు అంశం పైన రాష్ట్ర పార్టీ నేతలను క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Recommended Video
టీడీపీ తో సంబంధాలపైన క్లారిటీ
కేంద్రంలోనీ బీజేపీ ముఖ్యులతో సీఎం జగన్ సత్సంబంధాలు కొనసాగిస్తున్న సమయంలో... పొత్తుల పైన బీజేపీ ఏ రకంగా వ్యవహరిస్తుందనే అంశం పైన వైసీపీ సైతం నిశితంగా పరిశీలిస్తోంది. ఏపీలో తన వ్యూహాలు.. భవిష్యత్ పొత్తులు.. జనసేనతో సంబంధాలు.. 2024 ఎన్నికల రూట్ మ్యాప్ పైన తమ పార్టీ జాతీయాధ్యక్షుడు క్లారిటీ ఇస్తారని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు.
జనసేన - బీజేపీ మధ్య పొత్తు ఉన్నా.. ఇప్పటి వరకు ఉమ్మడి అజెండాతో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. ఇక, రెండు పార్టీల మధ్య పొత్తు నామమాత్రంగానే ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు జేపీ నడ్డా ఏపీ పర్యటన పైన రాజకీయ వర్గాల్లో ఆసక్తికి కారణమవుతోంది.