బాబు ఎఫెక్ట్: పురంధేశ్వరి సీటుపై బిజెపి డైలమా
వెంకయ్యనాయుడితో మంతనాలు జరిగిన తర్వాతనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధేశ్వరి ఇద్దరూ కాంగ్రెస్కు రాజినామా చేశారు. వెంకటేశ్వర రావు రాజకీయ సన్యాసం చేయగా, పురంధేశ్వరి మాత్రం బిజెపిలో చేరారు. పార్టీలో చేరేటపుడు పురంధేశ్వరిని తిరిగి విశాఖపట్నం లోక్సభ స్ధానం నుంచే పోటీ చేసేలా చూస్తానని వెంకయ్య హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతు న్నాయి.
పొత్తు తదితర పరిణామాలలో సీమాంధ్ర ప్రాంతంలో బిజెపికి తెలుగుదేశం పార్టీ ఐదు లోక్సభ స్దానాలను మాత్రమే కేటాయించింది. వాటిలో తిరుపతి, అరకు స్దానాలు ఎస్టీ, ఎస్సీలకు రిజర్వ్ అయినవి. మిగిలిన సీట్లలో నర్సాపురం నుంచి రఘురామ కృష్ణంరాజు పోటీ చేయనున్నారు. విశాఖపట్నం సీటు నుంచి సీమాంధ్ర బిజెపి అధ్యక్షుడు హరిబాబు పోటీ చేయాలని అనుకుంటున్నారు.
ఇక మిగిలిన ఒక్క సీటు కడప జిల్లాలోని రాజంపేట. అయితే, రాజంపేట సీటు నుంచి పురంధేశ్వరి పోటీ చేయడం సాధ్యం కాదు. హరిబాబును తప్పించి పురంధేశ్వరికి బిజెపి నాయకత్వం విశాఖపట్నం సీటు కేటాయిస్తుందా అనేది అనుమానంగానే ఉంది. పురంధేశ్వరి కోసం అరకును టిడిపికి అప్పగించి, ఒంగోలు సీటు అడగాలనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. చివరికి, రాజ్యసభకు పంపుతామని చెప్పి పురంధేశ్వరిని పోటీ నుంచి తప్పిస్తారా అనేది కూడా అనుమానంగానే ఉంది.