పురందేశ్వరికి బాధ్యతలు, బీజేపీ తేల్చేసింది -పవన్ వాట్ నెక్ట్స్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఎన్నికలు జరుగనున్న కీలక సమయంలో ఎన్టీఆర్ కుమార్తెకు బీజేపీ అగ్రనాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నియామకం ద్వారా బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టత ఇచ్చింది. పవన్ కోరుకున్న విధంగా మూడు పార్టీల పొత్తు సాధ్యం అయ్యేలా లేదు. దీంతో ఇప్పుడు పవన్ నిర్ణయం కీలకం కానుంది. టీడీపీతోనే ముందుకు వెళ్తారా. బీజేపీతోనే కొనసాగుతారా అనేదే ఇప్పుడు కీలక అంశం.
పురందేశ్వరి నియామకంతో:బీజేపీ ఏపీ పార్టీ పగ్గాలు పురందేశ్వరికి అప్పగించింది. ఈ నియామకం అనేక అంశాలకు స్పష్టత ఇచ్చింది. ఏపీలో జగన్ ను ఓడించేందుకు టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని పవన్ ప్రతిపాదించారు. బీజేపీ ముఖ్య నేతలతోనూ చర్చించారు. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. నాలుగున్నారేళ్ల తరువాత చంద్రబాబుతో మంతనాలు .. జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలతో మరోసారి టీడీపీ, బీజేపీ కలుస్తున్నాయనే ప్రచారం సాగింది. ఏపీకి వచ్చిన నడ్డా, అమిత్ షా నేరుగా వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు సంధించారు. దీని ద్వారా ఇక 2014తరహా పొత్తులు ఖాయమనే చర్చ మొదలైంది.

సంకేతాలు క్లియర్:బీజేపీ ఏపీ అధ్యక్షుడు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏపీ బీజేపీలో వైసీపీ..టీడీపీ అనుకూల నేతలుగా కొంత మంది పైన ముద్ర పడింది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ సైతం సోము వీర్రాజు తీరు పైన పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసారు. తాము వైసీపీ....టీడీపీ ఎవరికీ అనుకూలం కాదనే సంకేతాలు ఇస్తూ పురందేశ్వరిని బీజేపీ నాయకత్వం ఎంపిక చేసింది.
ఇదే సమయంలో పురందేశ్వరి ఎంపిక వెనుక పక్కా వ్యూహం స్పష్టం అవుతోంది. టీడీపీకి ప్రధాన ఓట్ బ్యాంక్ గా ఉన్న ఒక ప్రధాన సామాజిక వర్గంపైన ప్రభావం చూపటంతో పాటుగా.. ఆ వర్గ ఓట్లను బీజేపీ వైపు ఆకర్షించేందుకు పురందేశ్వరికి బాధ్యతలు ఇచ్చినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. దీని ద్వారా టీడీపీ కి మూలమైన నందమూరి కుటుంబంతో పాటుగా..మద్దతు ఓట్ల పైన బీజేపీ గురి పెట్టినట్లు స్పష్టం అవుతోంది.

పవన్ రూటు ఎటు:ఇక, పవన్ కోరుకున్నట్లుగా మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు లేవనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. తొలుత సత్యకుమార్ పేరు ప్రముఖంగా ప్రచారం జరిగింది. సత్యకుమార్ కు పార్టీ పగ్గాలు ఇస్తే టీడీపీతో పొత్తు ఖాయమనే అంచానలు వ్యక్తం అయ్యాయి. కానీ, ఇప్పుడు పురందేశ్వరికి పార్టీ పగ్గాలు ఇవ్వటం ద్వారా బీజేపీ లక్ష్యం టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది స్పష్టం అవుతోంది. దీంతో..ఇప్పుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే ఉన్న పొత్తు బీజేపీతో కొనసాగిస్తారా..
లేక టీడీపీతో కలిసి ముందుకెళ్లేందుకు పొత్తుకు గుడ్ బై చెబుతారా అనేది తేలాల్సి ఉంది. పురందేశ్వరికి పవన్ అభినందనలు తెలిపారు. బీజేపీ నేతలతో మరోసారి చర్చల తరువాత పవన్ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ మాత్రం పవన్ తమతోనే ఉంటారని భావిస్తోంది. దీంతో..ఇప్పుడు పురందేశ్వరి నియామకంతో పొత్తుల అంశం ఎటు టర్న్ తీసుకుంటుందనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications