టీడీపీ-జనసేనతో బీజేపీ కలుస్తుందా : మారుతున్న సమీకరణాలు..!!
కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు బీజేపీ నాయకత్వం తెలుగు రాష్ట్రాల పైన ఫోకస్ పెడుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో ఏపీలోనూ కొత్త రాజకీయానికి వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఒక వైపు టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ బీజేపీ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. బీజేపీని కలుపుకొని వెళ్లాలనే ఈ రెండు పార్టీల ప్రతిపాదన వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.
ఏపీలో బీజేపీ కొత్త వ్యూహం : ఏపీలో 2014 పొత్తులను తిరిగి రిపీట్ చేయాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. తిరిగి అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తన అధికారం నిలబెట్టుకోవటం కోసం సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేనతో కలిసి రావాలని బీజేపీ వద్ద పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు చేసారు.

బీజేపీ ఇప్పటికీ తమ నిర్ణయం ఏంటనేది స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలోనే ఈ రెండు పార్టీల పొత్తు..ఫలితాల పైన బీజేపీ సర్వే చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నట్లు తాజా వ్యూహాలతో అర్దం అవుతోంది. అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
పార్టీలో చేరికల దిశగా : అందులో భాగంగా పార్టీలో చేరికల పైన ఫోకస్ చేయాలని నిర్దేశించింది. ప్రధానంగా కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యులను బీజేపీలోకి ఆహ్వానించేలా కసరత్తు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
ప్రధానంగా టీడీపీ, జనసేన ఆశలు పెట్టుకున్న సామాజిక వర్గాలకు చెందిన నేతలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, తోట నర్సింహం, ఏరాసు ప్రతాపరెడ్డి, జీవీ హర్షకుమార్ వంటి నేతలతో సంప్రదింపులు మొదలైనట్లు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో బీజేపీ చీఫ్ నడ్డా పర్యటన ఏర్పాటు అయ్యేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.

బీజేపీ నిర్ణయం తరువాతనే : దీంతో..టీడీపీ, జనసేన తో కలిసే అవకాశం లేనట్లేనని బీజేపీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లొ సొంతంగా ఎదగాలనేదే తమ విధానమని చెబుతున్నారు. అయితే, కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత పొత్తుల విషయంలో బీజేపీ అధినాయకత్వం స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రంలోని బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా పార్టీ కేంద్ర నాయకత్వం పొత్తులకు నో చెబుతుందా, లేక కలిసి పోటీకి అంగీకరిస్తుందా అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీ తమ నిర్ణయం వెల్లడించే వరకు వేచి చూసి, ఆ తరువాత తమ పొత్తు పైన అధికారికంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో టీడీపీ, జనసేన ఉన్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications