పవన్ ను వదలబోం-బీజేపీ హైకమాండ్ క్లారిటీ- చంద్రబాబుతో భేటీపై రియాక్షన్ ఇదే !
ఏపీలోని విజయవాడ నోవోటెల్ హోటల్లో నిన్న జరిగిన చంద్రబాబు-పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో బీజేపీతో సంబంధాలపై ఈ ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అధిష్టానం పెద్దలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫోన్లో మాట్లాడారు. దీంతో ఆయనకు అధిష్టానం క్లారిటీ ఇచ్చింది.

చంద్రబాబు-పవన్ భేటీపై బీజేపీ
నిన్న విజయవాడ నోవోటెల్ హోటల్లో పవన్-చంద్రబాబు భేటీతో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పవన్ ను మిత్రపక్ష నేతగా పరిగణిస్తున్న బీజేపీపై నిప్పులు చెరిగిన ఆయన.. అనంతరం చంద్రబాబుతో భేటీ కావడంపై కాషాయ పార్టీ ఆత్మరక్షణలో పడింది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందా లేదా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఈ విషయంపై చర్చించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ ఢిల్లీ పెద్దలకు ఫోన్ చేశారు.

హైకమాండ్ తో సోము చర్చలు
విశాఖపట్నం ఘటనలు, అనంతరం పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయిన వైనంపై అధిష్టానం పెద్దలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫోన్ చేశారు. బెంగళూరులో ఉన్న ఆయన.. అక్కడి నుంచే అధిష్టానానికి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిణామాల్ని అధిష్టానం పెద్దలకు వివరించారు. పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు గురించి వారికి సోము వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన నేతలు.. సోముకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం అనుసరించాల్సిన వైఖరిపై క్లారిటీ కూడా ఇచ్చినట్లు సమాచారం.

బీజేపీ అధిష్టానం క్లారిటీ
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై సోము వీర్రాజుకు బీజేపీ పెద్దలు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ భేటీని రొటీన్ గానే చూడాలని, దీన్నో పెద్ద విషయంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కు లభించిన సానుభూతిగానే దీన్ని చూడాలని వారు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే భవిష్యత్తులోనూ బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందని కూడా సంకేతాలు ఇచ్చారు. పవన్ కు అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలుసుకుని వాటిపై చర్చిద్దామని కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తద్వారా భవిష్యత్తులో టీడీపీ, జనసేనతో కలిసి ముందుకెళ్లే విషయంలో అధిష్టానం బీజేపీ రాష్ట్ర నేతలకు ఓ క్లారిటీ ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications