పవన్ కల్యాణ్ ఇప్పుడు గుర్తొచ్చాడా??
ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతాపార్టీ నేతలకు పవన్ కల్యాణ్ ఇప్పుడు గుర్తొచ్చినట్లున్నారని సీనియర్ రాజకీయవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖపట్నంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల మధ్య అర్థంతరంగా తన పర్యటనను ముగించుకొని విజయవాడకు చేరుకున్న పవన్ ను బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసిన సంగతి తెలిసిందే. జరుగుతున్న అంశాలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు.

సోముపై విమర్శల వర్షం
సరిగ్గా సోము చెప్పిన ఈ విషయంమీద జనసైనికుల నుంచే కాకుండా పవన్ అభిమానుల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ విశాఖపట్నం పర్యటనకు ముందుకు ముందు కేంద్ర పెద్దలతో మాట్లాడితే బాగుండేదని, కానీ పవన్ మంగళగిరి చేరుకున్న తర్వాత మాట్లాడటంవల్ల ఏం ఉపయోగమని, ఈ మధ్యలో ఎన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయో గమనించారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. విమానాశ్రయంలో దాడిపై తప్పుడు కేసులు పెట్టారని, జనసేనాని బసచేసిన నోవాటెల్ హోటల్ లో అన్ని గదులను పోలీసులు సోదాలు చేసి ఇబ్బందికి గురిచేయడం, విశాఖపట్నం వదిలి వెళ్లాలంటూ పవన్ కు పోలీసులు నోటీసులివ్వడం, ఎవరినీ కలవనివ్వకుండా అడ్డంకులు సృష్టించడం కనపడలేదా? అని నిలదీస్తున్నారు.

కరోనా వల్ల పెరిగిన దూరం?
నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదుచేయడంతో అప్పటికప్పుడు కోర్టుకు వెళ్లి బెయిల్ ఇప్పించుకోవడం.. కోర్టు దగ్గరకూడా దాదాపు 200 మందికిపైగా పోలీసులను మొహరింపచేయడంలాంటివన్నీ బీజేపీ నేతలకు కనపడలేదా? అప్పుడు మద్దతివ్వడానికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. మిత్రపక్షంగా, స్నేహధర్మంతో కేంద్రంతో మాట్లాడి కార్యక్రమాలను సజావుగా నడిపించాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. కానీ పవన్ పర్యటనలో ఎక్కడా ఆ పార్టీ కార్యకర్త కూడా కనపడలేదు.
తిరుపతి లోక్ సభకు జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా జనసేన బీజేపీకి మద్దతివ్వడంతోపాటు పవన్ సభలో పాల్గొని మాట్లాడారు. అధికారికంగా ఇరుపార్టీల మధ్య జరిగిన చివరి కార్యక్రమం అదే. ఇటీవలే ఒక కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ కరోనా వల్ల తమ రెండు పార్టీల మధ్య భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గిపోగానే ఇది కూడా తగ్గిపోతుందని చెప్పరు. కరోనా ప్రభావం తగ్గుతుందేమోకానీ సమాజం నుంచి మాత్రం వెళ్లదు. అలాగే జనసేన, బీజేపీ మధ్య స్నేహం కూడా అలాంటిదే.

స్నేహధర్మాన్ని విస్మరించిన బీజేపీ?
ముఖ్యమంత్రి పదవిపై సందిగ్ధత తలెత్తిన సమయంలో తమ రెండుపార్టీల పొత్తుతో ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణే కొనసాగుతాడని పార్టీ స్పష్టం చేసింది. కానీ ఆ తర్వాత మాట మార్చింది. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఏనాడూ ఇద్దరూ కలిసి కార్యక్రమాలు నిర్వహించింది లేదు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా బీజేపీ సొంతంగానే చేసిందికానీ మిత్రపక్షాన్ని ఆహ్వానించలేదు. ఇటీవలే అమరావతికి మద్దతుగా పాదయాత్ర చేసిన సమయంలో కూడా జనసేనను ఆహ్వానించలేదు.
కేంద్ర పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించి రాష్ట్రంలో జనసేనను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నారంటూ జనసైనికులు ఆరోపిస్తుంటారు. గత ఎన్నికల్లో తాను స్వయంగా ఓటమికి గురైనప్పటికీ, ఒకే ఒక సీటు గెలుచుకున్నప్పటికీ తమ నేత ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రీతిలో వీరి రాజకీయం ఉందని జనసేన నాయకులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications