ఎవరు డబ్బులిస్తే వారి వైపే పవన్ కళ్యాణ్...ప్రస్తుతం బిజెపి పోషిస్తోంది:కత్తి మహేష్
Recommended Video

కర్నూలు:పవన్ కళ్యాణ్ కు ఎవరు డబ్బులిస్తే వారి వైపు మాట్లాడటం అలవాటని సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆరోపించారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీజేపీ నాయకులు పవన్ను పోషిస్తున్నారని చెప్పారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మాదిగ రాజకీయ చైతన్య సభకు కత్తి మహేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 500 మంది ఓటర్లను కూడా ప్రభావితం చేయలేరని...మరి 5 వేల నుంచి 6 వేల ఓట్లున్న మనమెందుకు చాలెంజ్ చేయకూడదంటూ మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటి వైఖరి రాబోయే రెండు మూడు నెలల్లో మళ్లీ మారుతుందన్నారు. పవన్ ఎప్పుడు ఎవరితో జతకడతాడో తెలియదు...కేవలం తన స్వార్థం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడని కత్తి మహేష్ దుయ్యబట్టారు. ఎక్కడైనా ఎవరైనా మాదిగలను పట్టించుకునే వారికే ఓట్లు వేయాలని కత్తి మహేష్ పిలుపునిచ్చారు. రెండు సార్లు
ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మాదిగలను మోసం చేశారని కత్తి మహేష్ చెప్పారు.
మాదిగలను ఉద్దరిస్తానని చెప్పిన చంద్రబాబు నిజానికి మాదిగలకు చేసింది శూన్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని...అలాగే మాదిగలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని కత్తి మహేష్ డిమాండ్ చేశారు. ఇక వైసిపి అధినేత జగన్ మాదిగల గురించి మాట్లాడాలంటేనే భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. మాదిగలంతా రాజకీయ చైతన్యంతో వ్యవహరించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
లేకుంటే 2019 ఎన్నికల తరువాత మాదిగల అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు కత్తి మహేష్ తెలిపారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీలలో ఎవరు టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరి ఎంపిగా పోటీ చేయడం జరుగుతుందని కత్తి మహేష్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications