జగన్ సర్కారును గద్దెదించే ప్రత్యామ్నాయం మాదే, మోడీ డజన్లకొద్ది రత్నాలిచ్చారు: సోము వీర్రాజు
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తుందని మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు.
జగన్ సర్కారును గద్దెదించే ప్రత్యామ్నాయం ఇదే: సోము వీర్రాజు
జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ-జనసేన మాత్రమే అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రెండు నెలల క్రితమే బీజేపీ అగ్రనేత అమిత్ షా తమకు ఈ విషయంపై దిశానిర్దేశం చేశారని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రజాస్వామ్య వ్యవస్థను సీఎం నాశనం చేశారని విమర్శించారు. ఈ వాలంటీర్ వ్యవస్థకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ ద్వారా అమలవుతున్న శక్తి కేంద్రమేనని అన్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ఏపీ ప్రజలకు వివరించాలన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించి జగన్ కూడా తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని సోము వీర్రాజు విమర్శించారు. 14, 15వ ఆర్దిక సంఘం నుంచి గ్రామాల అభివృద్ధికి ప్రధాని మోడీ నిధులు కేటాయించారని తెలిపారు.
మోడీ డజన్లకొద్ది రత్నాలిచ్చారు.. ఆ మంత్రికి సోము వీర్రాజు సవాల్
సర్పంచుల ఆధారంగా నిధులు ఇస్తున్న శక్తి నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలకు ఇచ్చే రూ. 1 కిలో బియ్యం ఖర్చు కేంద్రానిదేనని, ఇంకా మధ్యాహ్న భోజన పధకం, స్కూల్ యూనిఫాం, పాఠశాలలు అభివృద్ధికి మోడీ నిధులిచ్చారని సోము వీర్రాజు చెప్పారు. జగన్ నవరత్నాలిస్తే... మోడీ డజన్ల కొద్దీ రత్నాలు ఇచ్చారన్నారు సోము వీర్రాజు. జగన్ పథకాలకు అప్పులు చేసి.. అప్పులు పుట్టని పరిస్థితికి వచ్చారన్నారు. రూ. 3 వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేస్తామని కేంద్రం చెప్పింది. రైల్వేకు రూ. 64 వేల కోట్లు కేటాయించారు. జగన్ మాత్రం కాగ్ రిపోర్టులకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారని సోము వీర్రాజు విమర్శించారు. బీజేపీకి ఓట్లు పడవన్న మంత్రి వెల్లంపల్లి చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎవరు ఎన్నెన్ని నిధులిచ్చారో బహిరంగంగా చర్చిద్దామన్నారు. మోడీకి ఓటేయాలని వెల్లంపల్లితోనే చెప్పిస్తామన్నారు సోము వీర్రాజు.
ఏపీలో బీజేపీ రాజకీయం ప్రారంభించింది: సోము వీర్రాజు
ఏపీలో బీజేపీ రాజకీయం చేయడం ప్రారంభించిందని, భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వస్తారో ప్రజలే నిర్ణయిస్తారన్నారు సోము వీర్రాజు. అధికారం ఉంది కదా అని అడ్డగోలు నిర్ణయాలు చేస్తే బీజేపీ నిలదీస్తుందన్నారు. రాజధానిని కట్టలేని చేతకాని ప్రభుత్వమని వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. అమరావతిని చంపేద్దామని కుట్రలు చేస్తున్నారు. మీరు రాజధాని కట్టకున్నా.. బీజేపీ రహదారుల అభివృద్ధి, మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణం చేసినట్లు తెలిపారు. యూనివర్శిటీలు, ఆస్పత్రులు కట్టి విద్యార్ధులకు, పేదలకు సేవలు అందించామన్నారు. అమరావతి నుంచి అనంతపురం వరకు రూ. 10 వేల కోట్లతో ఎక్స్ ప్రెస్ రహదారిని నిర్మిస్తున్నామని సోము వీర్రాజు వివరించారు.
Recommended Video
ఇకపై బీజేపీపై కూతలు కూయలేరు: సోము వీర్రాజు
రాజకీయ నాయకుల్లారా మాయ మాటలు, కాకమ్మ కబుర్లు మానేయాలని సోము వీర్రాజు హితవు పలికారు. బీజేపీ మంత్రం అభివృద్ధి అని స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల్లో అదే మా గెలుపు తంత్రం. ఏపీకి చంద్రబాబు హయాంలో రూ. 35 వేల కోట్లు, వైసీపీ హయాంలో రూ. 36 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు వీర్రాజు. నరేగా కింద నిధులు ఇచ్చే కేంద్రం పోలవరం నిర్మాణానికి ఎందుకు ఇవ్వం. ఇక నుంచి బీజేపీపై కూతలు, కోతలు కూయలేరు. శక్తి కేంద్రం ద్వారా ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసేలా అందరూ అడుగులు వేయాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.