ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ రచ్చ-బీజేపీ నేతల అరెస్టులు-టీడీపీతో పోలుస్తూ సునీల్ ట్వీట్
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేస్తున్న టిప్పు సుల్తాన్ విగ్రహంపై బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ప్రొద్దుటూరులో పర్యటించి ఈ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇవాళ మరోసారి రంగంలోకి దిగింది. దీంతో పోలీసులు ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజుతో పాటు పలువురు నేతల్ని అడ్డుకుని కడపకు తరలించారు. మరోవైపు టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలో జగన్ సర్కార్ ను తప్పుబడుతూ బీజేపీ నేత సునీల్ దేవధర్ పెట్టిన ట్వీట్ లో టీడీపీని లాగడంతో అదీ చర్చనీయాంశంగా మారింది.
టిప్బుసుల్తాన్ విగ్రహంపై రచ్చ రచ్చ
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయనున్న టిప్పుసుల్తాన్ విగ్రహంపై బీజేపీ ఆగ్రహం కొనసాగుతోంది. ఇవాళ మరోసారి ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై నిరసనలు చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజుతో పాటు పలువురు నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై ప్రొద్దుటూరు మున్సిపాలిటీ తీర్మానం ఉపసంహరించుకోవాల్సిందేనని నేతలు డిమాండ్ చేశారు.
ప్రొద్దుటూరులో బీజేపీ నేతల అరెస్ట్
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు ప్రయత్నించారు. టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై నిరసనలకు దిగుతున్న బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, నాగోతు రమేష్ నాయుడుతో పాటు పలువురు నేతల్ని అరెస్టు చేసి కడపకు తరలించారు.
శిలాఫలకం కూల్చేస్తామని సోము హెచ్చరిక
రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన జగన్.. ముస్లింలు, క్రైస్తవులకు అనుకూలంగా పాలన సాగిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఈ మేరకు మున్సిపాలిటీ చేసిన తీర్మానం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. లేకుంటే టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు శంఖుస్ధాపన చేసిన శిలాఫలకం కూల్చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.
మేం టీడీపీలా కాదన్న సునీల్ దేవధర్
మరోవైపు ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న బీజేపీ నేతల్ని అరెస్టు చేయడంపై ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ మండిపడ్డారు. జగన్ సర్కారును ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న వారిని అణచేయాలని ప్రయత్నిస్తే అతి మీ పతనానికి దారి తీస్తుందని జగన్ సర్కార్ ను సునీల్ దియోధర్ హెచ్చరించారు. అదే సమయంలో మేం టీడీపీలా కాదు 40-60 కాంట్రాక్టులు పంచుకునే వాళ్లం కాదంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.