టీడీపీ వైఖరి మార్చుకోకపోతే.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: పురంధేశ్వరి హెచ్చరిక
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. పరిపాలన విషయంలో తప్పులు చేస్తున్న టీడీపీ, ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిత్రపక్షమైన టీడీపీ ఇలాగే వ్యవహరిస్తూ పోతే 2019 ఎన్నికల్ో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని పురంధేశ్వరి హెచ్చరించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు 80 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని... అయినా, ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులను అందించడం లేదని ఆమె దుయ్యబట్టారు.
కొన్నిరోజులుగా బీజేపీ ఆరోపణలు...
కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడంతో రెండు పార్టీలు పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ మిత్రధర్మం పాటించడం లేదంటూ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, అక్కడెక్కడో వాపును చూసి బీజేపీ ఇక్కడ బలుపు అనుకుంటోందంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
ఎదురుదాడి వద్దన్న చంద్రబాబు...
మరోవైపు బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా కొంతమంది టీడీపీ నేతలు మాత్రం ఎదురుదాడి మొదలెట్టారు. దీంతో బీజేపీ నాయకులు మరింత రెచ్చిపోయారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే పొత్తు లేకుండానే ముందుకెళతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు ఏం మాట్లాడినా.. ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ చంద్రబాబు తమ శ్రేణులకు సూచించారు.
Recommended Video
కేంద్రంపై నిందలు సరికాదు...
టీడీపీ, బీజేపీల నడుమ వివాదం కొంత సద్దుమణిగినట్లే కనిపించినా తాజాగా బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపునకు సంబంధించి అనేక ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, గత డిసెంబరులోనూ పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పించిందని విమర్శించారు. కేంద్రానికి సరైన లెక్కలు పంపకుండానే అవసరమైన నిధులు విడుదల చేయటం లేదని కేంద్రంపై నిందలు వేయడం సరికాదని ఆమె మండిపడ్డారు.
మిత్రపక్షమైనా, ప్రతిపక్షమైనా ఒక్కటే...
కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందనే ఆరోపణ సరికాదంటూ బీజేపీ నేత పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బాదులు ఈఏపీ ప్రాజెక్టు ద్వారా అంతకన్నా ఎక్కువ నిధులే ఇస్తోందన్నారు. టీడీపీ తమకు మిత్రపక్షమా? ప్రతిపక్షమా? అనేది ముఖ్యం కాదని, సరైన లెక్కలు పంపడం లేదన్నదే తమ పాయింట్ అన్నారు. ఇప్పటికైనా కేంద్రానికి సరైన లెక్కలు పంపితే తక్షణమే కేంద్రం నిధులు విడుదల చేస్తుందని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఒడిశా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అడ్డంకిగా మారాయని చెప్పారు.