జగన్ సర్కారును కేంద్రం కూలదోస్తుందా? రేపే డెడ్లైన్.. మోదీ పెద్దన్నైతే బాబు దద్దమ్మా?: జీవీఎల్ ఫైర్
వికేంద్రీకరణ పేరుతో జగన్ సర్కారు పెద్ద కల్పితకథను, బోగస్ విధానాన్ని ఏపీ ప్రజలపై రుద్దుతోందని.. ఇదంతా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే జరుగుతోందని తప్పుడు ప్రచారం చేయిస్తోందని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. జగన్ చేస్తోన్న పిచ్చి తుగ్లక్ పనులకు ఢిల్లీ నుంచి ఎలాంటి సహకారం ఉండబోదని, కొత్త మిత్రదళం జనసేనతో కలిసి ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామని బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర సర్కారును కూలదోసే అంశంపైనా చంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి ఉత్తుత్తి రాజధాని
అమరావతి విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు రెండూ తమ స్వార్థప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయని, రాజధాని వ్యవహారాన్ని అవినీతమయం చేశాయని జీవీఎల్ ఫైరయ్యారు. మూడు రాజధానులు అనేది ఓ మిధ్య అని అసెంబ్లీలో పెట్టిన బిల్లుతోనే తేలిపోయిందని, అన్నీ విశాఖకు తీసుకెళ్లి.. ఒక్క అసెంబ్లీని మాత్రమే ఉంచి అమరావతిని ఉత్తుత్తిరాజధానిగా మార్చేశారని విమర్శించారు. బహుశా లీగల్ చిక్కులు రావొద్దనే సీఎం జగన్ ఇలా చేసుంటారని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.
కేంద్రం గట్టిగా తల్చుకుంటే..
ఏపీలో వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతోపాటు, గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపైనా బీజేపీ-జనసేన కూటమి పోరాడుతుందన్న జీవీఎల్.. కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన ఏపీ ప్రభుత్వాన్ని బీజేపీ చేయగలిగిందేమీ లేదని అన్నారు. ‘‘మా పార్టీ కార్యకర్తలు చాలా మంది ఇలా అడుగుతారు.. సార్, కేంద్రంలో మనమే ఉన్నాం కదా.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసిపారేస్తే పనైపోతుంది కదాని అంటుంటారు. కానీ బీజేపీ ప్రజాస్వామ్య విలువల్ని నమ్మే పార్టీ. ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా విశ్వసించే పార్టీ. కాబట్టి అలా చేయడం కూదరదని మావాళ్లు సర్దిచెబుతుంటా''అని వివరించారు.
ఢిల్లీకి సంబంధం లేదు..
కేరళ, వెస్ట్ బెంగాల్ లో అక్కడి ప్రభుత్వాలు ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల్ని దారుణంగా ఊచకోత కోస్తుంటాయని, అలాంటి సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వాల్ని కూలదోసే దిశగా బీజేపీ ఆలోచించబోదని, ఏపీలో జగన్ సర్కారు విషయంలో అలాగే వ్యవహరిస్తామని, రాజధానుల ఏర్పాటు పూర్తిగా రాష్ట్రపరిధిలోనే అంశమేగానీ కేంద్రానికి సంబంధం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు.
టీడీపీ-వైసీపీ మిలాఖత్.. రేపే డెడ్ లైన్..
అమరావతిని భ్రష్టుపట్టించే క్రమంలో టీడీపీ, వైసీపీలు కలిసి డ్రామాలాడుతున్నాయని, భూదందా, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై నిజంగా అన్ని ఆధారాలుంటే చర్యలకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో అర్థంకావడంలేదని నర్సింహారావు వాపోయారు. ‘‘ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి రేపటిలోగా అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఒకవేళ అలా కాలేదంటే టీడీపీ-వైసీపీ మిలాఖత్ అయినట్లేనని ప్రజలు అర్థం చేసుకుంటారు''అని చెప్పారు.
పెద్దన్న.. దద్దమ్మ..
రాజధాని మార్పు విషయంలో అనాలోచితంగా వ్యవహరిస్తోన్న సీఎం జగన్ ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని కొంతమంది టీడీపీ నేతలు డిమాండ్ చేయడాన్ని బీజేపీ నేత జీవీఎల్ ఖండించారు. టీడీపీ తాను చేసిన తప్పుల్ని కేంద్రంపై రుద్దడానికే ఈ రకమైన వాదనను తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. మోదీ పెద్దన్న పాత్ర పోషిస్తే.. చంద్రబాబు దద్దమ్మ పాత్ర పోషిస్తారా? అని ఎద్దేవా చేశారు. కేంద్రం అనుమతితోనే రాజధానులు తరలిస్తున్నామన్న వైసీపీ, కేంద్రం జోక్యం చేసుకోవాలంటున్న టీడీపీ పార్టీలు రెండూ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.