చంద్రబాబుపై సోము వీర్రాజు ప్రశంసల వర్షం...అనూహ్యం...
టిడిపి అధినేత చంద్రబాబుపై బిజెపి నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశంసల వర్షం కురిపించారు...అవునండి మీరు చదివింది నిజమే?...ఎప్పుడూ ఎపి లోని టిడిపి ప్రభుత్వంపై, సిఎం చంద్రబాబుపై పదునైన విమర్శలతో దాడి చేసే సోమూ వీర్రాజు అనూహ్యంగా బాణీ మార్చారు...నమ్మశక్యంగా లేదా?...అయితే సోమూ వీర్రాజు ఏమి మాట్లాడారో...చంద్రబాబుని ఎలా పొగిడారో మీరే చదవండి...
అవకాశం దొరికినా, దొరకకపోయినా తానే అవకాశం సృష్టించుకొని మరీ టిడిపిపై విమర్శల దాడి చేసే బిజెపి నేత సోము వీర్రాజు ఉన్నట్టుండి పంథా మార్చారు. తన సహజ శైలికి భిన్నంగా ఎపి లోని టిడిపి ప్రభుత్వంపై, చంద్రబాబుపై ఈసారి విమర్శల దాడి కాకుండా పొగడ్తల వర్షం కురిపించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు...ఈ అరుదైన సందర్భానికి రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ వేదిక అయింది. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సోమూ వీర్రాజు చంద్రబాబుకు,టిడిపి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
సోము వీర్రాజు...ఏమన్నారంటే...
"ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యకృషీవలుడు. ఆయనకున్న టెక్నాలజీ ప్రపంచంలో ఎవరి వద్దా ఉండదు. కేంద్రంనుంచి ఎన్ని నిధులు వచ్చినా, ఇంకా రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ఏమి చేసింది?...నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రాజెక్టులో భాగంగా రెండు కాలువలు తవ్వారు. అవి కూడా అంతంతమాత్రమే. ఒక కాలువ పనులు 40 శాతం, రెండో కాలువ పనులు 60 శాతమే చేశారు. చంద్రబాబు మాత్రం సోమవారం, పోలవరం అంటూ నిత్యం పాకులాడుతూనే ఉన్నారు"...అని బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.
పోలవరంపై...కేంద్రం సహకారం గురించి...
కేంద్రమంత్రి గడ్కరీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఉన్నారని సోమూ వీర్రాజు తెలిపారు. అయితే చంద్రబాబు అంత అవిశ్రాంతంగా పనిచేయడం కేంద్రం అందిస్తున్నసహకారం వల్లే సాధ్యపడుతోందని అన్నారు. అయితే కేంద్రం నిధులతో చేపట్టే కార్యక్రమాలలో కూడా ఎక్కడా ప్రధాని బొమ్మను మాత్రం ప్రదర్శించడం లేదని...అని తన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ బీసీల్లోని చిన్నకులానికి చెందిన వ్యక్తి కాబట్టే అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు విమర్శిస్తున్నారంటూ పరోక్షంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్పై ఆరోపణలు చేశారు.
ఈసారి దాడి...ఉండవల్లిపై...ఆయనో ఖాళీ చక్రవర్తి...
కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి ఓ ఖాళీ చక్రవర్తి అని...విభజన సమయంలో ఆయనతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు ఎంపీలు ఉన్నారని... అప్పుడు వీళ్లంతా ఏం చేశారని సోమూ వీర్రాజు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని తెగతిట్టి, ఇందిరమ్మను దూషించిన ఉండవల్లి ఆ తర్వాత అదే పార్టీలో చేరి, రెండుసార్లు ఎంపీగా పనిచేశారన్నారు. ఆయనకు ఇప్పుడు అవినీతికి, అభివృద్ధికి తేడా తెలియడంలేదని ఎద్దేవా చేశారు. అవినీతి వల్ల కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రం నుంచి వైదొలుతూ పోతుండగా, మరోవైపు బీజేపీ పెరుగుతూ పోతోందని విశ్లేషించారు.
ప్రత్యేక హోదా...అది ముగిసిన అంశం...పునరుద్ఘాటన...
ఎపికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని పునరుద్ఘాటించారు...దానిపేరుతో రాజకీయ పొత్తులు కుదరవని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి అన్నీఇస్తుందని తెలిపారు...ఏదేమైనా బిజెపి నేత సోము వీర్రాజు ఉన్నట్టుండి టిడిపి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. బిజెపితో బంధంపై చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యల అనంతరం ఆ పార్టీ నేత సోము వీర్రాజు ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యడం ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు చర్చనీయాంశం అయ్యాయి.