చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైర్: 'బీజేపీ ఏం చేసిందో చెప్పడానికే'
హైదరాబాద్: అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోనూ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతలు మరోసారి విమర్శలకు దిగారు. ఆంధ్రప్రదేశ్లో నిత్యావవసరాల ధరలు మండిపోతున్నాయని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరలు లేవు గానీ, మార్కెట్లో పప్పు ధాన్యాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ధరల నియంత్రణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజిలెన్స్ కమిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతుల కోసం ఉద్యమించడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. మార్చి 6 తర్వాత ధరల పెరుగుదల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యమం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే మార్చి 6న రాజమహేంద్రవరంలో బీజేపీ తలపెట్టిన బహిరంగసభ ఉంటుందని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఏమి చేసిందో చెప్పడానికే బీజేపీ సంకల్ప సభ పేరుతో దీనిని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సంకల్ప సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని ఆయన తెలిపారు. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారు పాకిస్థాన్ వెళ్లిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కమ్యూనిస్టులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, నాన్వెజ్ మానేయటంతో సీపీఐ నారాయణకు మతిభ్రమించిందని ఆయన ఎద్దేవా చేశారు. కాగా ఏపీలోని అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన కోరారు. గుంటూరు, కృష్ణా పరిసర ప్రాంతాల్లో అగ్రిగోల్డ్కు విలువైన అనేక భూములు ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications