ధుర్యోధనుడికి కృష్ణుడు సమయం ఇచ్చాడు : టీడీపీ- బీజేపీ పొత్తు : కాషాయం నేత సంచలనం..!!
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త పొత్తుల పైన రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మాజీ మిత్రులు టీడీపీ - బీజేపీ పొత్తు పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. పొత్తు ఉంటుందా..ఉండదా అనే దాని పైన అధికారికంగా టీడీపీ నుంచి క్లారిటీ లేదు. ఏపీతో సంబంధం ఉన్న బీజేపీ జాతీయ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాయి. ఆజాదీ కా మహోత్సవ్ కు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ- టీడీపీ అధినేత చంద్రబాబు పలకరించుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీల మధ్య బంధం తెగిపోయింది.
బీజేపీ నేతలు చెబుతోందేంటి
ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ.. బీజేపీ జాతీయ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఇక, మునుగోడులో బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ - బీజేపీ పొత్తు పైన వార్తలు మొదలయ్యాయి. ఈ పొత్తు అంశం పైన ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఈ పొత్తు వార్తల పైన కొత్త విశ్లేషణ చేసారు. ధుర్యోధనుడికి కృష్ణుడు సమయం ఇచ్చారని..కానీ, చేతులు మాత్రం కలపలేదంటూ వ్యాఖ్యానించారు. సీఎం హోదాలో జగన్..ప్రధానిగా ఉన్న మోదీని పలుమార్లు కలిసారని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో
ఆజాదీ కా మహోత్సవ్ పైన జరిగిన భేటీలో ప్రధాని మోదీ..అక్కడ చంద్రబాబుతో పాటుగా ఫరూక్ అబ్దుల్లాను కలిసిన అంశాన్ని దేవధర్ గుర్తు చేసారు. దీంతో..దేవధర్ ఎవరిని ధుర్యోధనుడిగా పేర్కొంటున్నారనేది మరో చర్చకు కారణమైంది. దీనికి కొనసాగింపుగా ఆయన ఢిల్లీ మీడియతో కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని చెప్పారు. ఆజాదీ కా మహోత్సవ్ పైన జరిగిన భేటీలో ప్రధాని మోదీ..అక్కడ చంద్రబాబుతో పాటుగా ఫరూక్ అబ్దుల్లాను కలిసిన అంశాన్ని దేవధర్ గుర్తు చేసారు. ఇక, పొత్తుల అంశం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని.. ఎవరో సంపాదకీయాల్లో రాసినంత మాత్రాన అది జరగదని వ్యాఖ్యానించారు. ఏపీలో ఏ పార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండదని దేవధర్ స్పష్టం చేసారు.
Recommended Video
ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా
అయితే, జనసేన ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా, రెండు పార్టీల మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. బీజేపీ నేతలు.. టీడీపీతో పొత్తు వార్తలను ఖండిస్తున్నా.. టీడీపీ నుంచి మాత్రం స్పందన లేదు. రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో వైసీపీ - టీడీపీ రెండు పార్టీలు ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతుగా నిలిచాయి. వచ్చే ఎన్నికల నాటికి కేంద్రం నుంచి జగన్ కు మద్దతు లేకుండా చూడాలనేది టీడీపీ వ్యూహం. అదే సమయంలో వైసీపీ అధినాయకత్వం జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంది. కేంద్రంతో సత్సంబంధాలు ఎన్నికల ముందు మరింత అవసరమని భావిస్తోంది. దీంతో..టీడీపీ వేస్తున్న అడుగులకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తోంది. దీంతో..ఇప్పుడు బీజేపీ తో పొత్తు వ్యవహారం కేంద్రంగా ఏపీలో రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారాయి.