జగన్పైనా మొదలు పెట్టేసారు..సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారు: బీజేపీ నేతల వ్యాఖ్యల వెనుక..!
బీజేపీ నేతలే టీడీపీనే కాదు..వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ తరహాలో కాకున్నా..సైలెంట్గానే తమ వ్యూహం ఏంటనేది చెప్పకనే చెప్పేస్తున్నారు. కరకట్ట మీద అక్రమంగా నిర్మించారనే కారణంతో ప్రజా వేదికను జగన్ కూల్చి వేయాలని ఆదేశించారు. దీనిని బీజేపీ నేతలు తప్పు బడుతున్నారు. అదే సమయంలో ప్రధాని మోదీతో జగన్ సఖ్యతగా ఉంటూ ప్రత్యేక హోదా కోసం ప్రతీ అవకాశాన్నిఉపయోగించుకుంటామని చెబుతున్నారు. ఇదే సమయం లో బీజేపీ నేతలు మాత్రం జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రజావేదిక కూల్చివేత సరికాదు..
అమరావతిలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదిక పైన ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ భవనాలతోనే కూల్చివేత ప్రారంభించాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగానే ప్రజావేదికను కూల్చి వేసారు. దీని పైన టీడీపీ నేతలు జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు సైతం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే..కూల్చివేత సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన వాటిని ప్రజా ప్రయోజనం కోసమే వినియోగించాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో కరకట్ట మీద బీజేపీ నేతల నిర్మాణాలు సైతం ఉండటంతోనే వీరు ఈ రకంగా వ్యాఖ్యానిస్తున్నారా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ..పురంధేశ్వరి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇదే సమయంలో అన్ని పార్టీల నేతలు తమతో టచ్లో ఉన్నారని చెబుతున్నారు.
ప్రత్యేక హోదా మీద పదేపదే..
ఏపీలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్ మాటలు నమ్మి వైసీపీకి 22 ఎంపీ సీట్లలో గెలిపించారని..హోదా సాధించాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక, హోదా బాధ్యత తమది కాదని తేల్చి చెబుతున్నారు. జగన్ పొర్లు దండాలు పెట్టినా ఏపీకి ప్రత్యేక హోదా రాదాని టీడీపీ ఎంపీలు.. తాజాగా బీజేపీ చేరిన నేతలు సైతం చెబుతున్నారు. మరో వైపు సీఎం జగన్ మాత్రం తాము కేంద్రం తో ప్రతీ సందర్భంలోనూ హోదా గురించి ప్రస్తావిస్తూనే ఉంటాం..ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటామని స్పష్టం చేసారు. ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు సైతం బీజేపీలో చేరిన తరువాత ఆ పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇది జగన్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది. జగన్ ఇంతలా మోదీ వద్ద ప్రాధేయ పడుతున్న సమయంలో ప్రత్యేక హోదా అంశంలో ఇప్పుడు ఇరుకున పెట్టే వ్యూహాలు అమలు అవుతున్నాయి.
Recommended Video
జగన్ సర్దుకుపోవాల్సిందేనా..
టీడీపీ నేతల వ్యాఖ్యల పైన వెంటనే రియాక్ట్ అవుతున్న వైసీపీ నేతలు బీజేపీ నేతల విషయంలో మాత్రం జగన్ సూచనల కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పైన స్పందించటానికి ఆచి తూచి వ్యవహరి స్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..ఏపీకీ వచ్చిన కేంద్ర మంత్రులు సైతం ప్రత్యేక హోదా విషయంలో తమ విధానం ఏంటనేది స్పష్టం చేస్తూనే ఉన్నారు. అదే విధంగా ప్రధాని మోదీతో కలిసిన ప్రతీ సందర్భంలోనూ జగన్ హోదా ఏపీకి ఇవ్వండని అభ్యర్దించటం మినహా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఏపీలో టీడీపీని టార్గెట్ చేసిన బీజేపీ విషయంలో కొంత సంయమనంతో ఉంటేనే మేలనే అభిప్రాయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. ప్రత్యేక హోదా విషచంలో చివరకు జగన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు జరిగే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయమూ ఉంది. అయినా..జగన్ రానున్న రోజుల్లో ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.