'కాపు గర్జన'కు బెదిరింపులు!: కొత్త ట్విస్ట్, చంద్రబాబుకు 'బిజెపి' చిక్కు
విజయవాడ: కాపుల రిజర్వేషన్ల సాధనకు ఆదివారం నాడు తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో జరగనున్న కాపు గర్జనకు బెదిరింపులు వస్తున్నాయని, ఆర్టీసీ బస్సులు ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర వాహనాల పైన కూడా ఆంక్షలు విధించారని అంటున్నారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో కాపు గర్జన జరగనుంది. దీనికి టిడిపి ప్రభుత్వం నుంచి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని కాపు రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. కాపు ఓట్లతో అధికారంలోకి వచ్చిన టిడిపి, ఇప్పుడు తమను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
శనివారం నాడు బిజెపి నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు జరగనున్న కాపు గర్జన ప్రభావం మొదటపడేది చంద్రబాబుపైనే అని, ఈ సభకు వచ్చే ప్రజలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను మోహరిస్తోందన్న సమాచారం ఉందని, ఇది బాధాకరమన్నారు.
కాపు గర్జనకు టిడిపి మిత్రపక్షమైన బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ మద్దతు పలకడం గమనార్హం. ఇప్పటికే కాపులను తమ వైపుకు మళ్లించుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. తాజా కాపు గర్జనకు ఇప్పటికే వైసిపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికాయి.
బిజెపి పార్టీ పరంగా ఏం చెప్పనప్పటికీ.. నాయకులు మద్దతు పలకడం గమనార్హం. ఇది చంద్రబాబుకు చిక్కులు తీసుకు వచ్చేదేనని చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాపుల వల్లే టిడిపి అధికారంలోకి వచ్చిందనే వాదన ఉంది. అందుకు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం కారణం.
కాపు ఓట్ల కోసం వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం పార్టీల్లో పోటీ పోటీ కనిపిస్తోంది. కాపులు తమ వెంటే ఉన్నారని టిడిపి చెబుతుండగా, కాపులకు అన్యాయం చేస్తున్నారని, ఇచ్చిన హామీ మేరకు బీసీల్లో ఎందుకు చేర్చడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు బిజెపి నేతలు కూడా కాపు గర్జనకు మద్దతు పలకడం గమనార్హం. ఇదిలా ఉండగా, కాపు గర్జనకు హాజరు కావొద్దని టిడిపి అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.