ఎన్నికల వేళ బిగ్ టర్న్, మెగాస్టార్ కు బీజేపీ బంపరాఫర్ - చిరంజీవి సిద్దమేనా..!!
ఏపీలో ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఈ సారి ఏపీలో ఎన్నికల పోరాటం అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ముఖ్యమంత్రి జగన్ సింగిల్ గానే బరిలోకి దిగారు. జగన్ ఓటమే లక్ష్యం గా టీడీపీ, జనసేన జత కట్టాయి. కాంగ్రెస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించింది. బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే బీజేపీ "మెగా" స్కెచ్ సిద్దం చేస్తోంది. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
కొత్త లెక్కలు: ఏపీలో బీజేపీ రాజకీయం ఏంటనేది క్రమేణా క్లారిటీ వస్తోంది. టీడీపీ, జనసేనతో బీజేపీ కలవటం పైన కొత్త సందేహాలు మొదలవుతున్నాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని..2014 నాటి పొత్తులు రిపీట్ చేయాలని చంద్రబాబు, పవన్ ఆశిస్తున్నారు. కానీ, బీజేపీ నుంచి ఇప్పటి వరకు స్పష్టత లేదు. తెలంగాణలో బీసీ నినాదంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది.

ఏపీలో పొత్తుతో వెళ్లటమా.. ఒంటరిగా పోటీ చేయటమా అనేది పార్టీలో చర్చ సాగుతోంది. నిర్ణయానికి ముందు అన్ని అంశాల పైన చర్చిస్తోంది. సొంతంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాల పైన కసరత్తు చేస్తోంది. ఏపీ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలే కీలకం. బీజేపీ ఇప్పుడు ఇదే అంశం ఆధారంగా కొత్త లెక్కలు సిద్దం చేస్తోందని సమాచారం.
బీజేపీ తాజా వ్యూహం: బీజేపీ ప్రస్తుతం జనసేనతో పొత్తు కొనసాగిస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతోనే తమ పొత్తు అనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. టీడీపీతో కలుస్తుందా లేదా అనేది తేల్చటం లేదు. ఈ సమయంలోనే పవన్ ను ఢిల్లీ రావాల్సిందిగా బీజేపీ నేతల నుంచి ఆహ్వానం అందింది. ఇక పొత్తుల పైన తేల్చే సమయం ఆసన్నమైంది.
ఇదే సమయంలో ఏపీలో కాపు-కమ్మ వర్గాలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. పవన్ తో పొత్తు ద్వారా కాపు మెజార్టీ వర్గం తమ వైపు ఉంటుందని భావిస్తోంది. అయోధ్య రామాలయం ద్వారా వర్గాలకు అతీతంగా తమకు మద్దతు పెరిగినట్లు అంచనా వేస్తోంది. ఈ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది.

బీజేపీ మెగా స్కెచ్: ఇక, ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్య నేతల సమాచారం. పార్టీలకు అతీతంగా ఈ నియామక ప్రక్రియ ఉంటుంది. సినీ రంగం నుంచి 2022లో విజయేంద్ర ప్రసాద్ ను నియమించారు. ఇప్పుడు చిరంజీవికి అవకాశం ఇవ్వటం ద్వారా కొత్త వ్యూహం సిద్ద చేస్తున్నట్లు చెబుతున్నారు.
గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ-2లో కేంద్ర మంత్రిగా పని చేసారు. పవన్ తో పొత్తు కొనసాగిస్తూ..చిరంజీవికి రాజ్యసభకు పంపటం ద్వారా ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తోంది. నామినేటెడ్ కోటాలో ఈ ఏడాది నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. మరి..బీజేపీ ఆఫర్ ను సినిమాల్లో బిజీగా ఉంటూ..దాదాపు రాజకీయాలకు దూరమైన చిరంజీవి అంగీకరిస్తారా..లేదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications