బిజెపి రాయలసీమ వ్యూహం: పవన్ కల్యాణ్కూ కౌంటర్?
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాత్రమే కాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కూడా చిక్కుల్లో పడేసే వ్యూహంతో బిజెపి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే బిజెపి రాయలసీమ ఎజెండాను ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది.
ఎన్నికలకు ఏడాది గడువు ఉండగా రాయలసీమ ఎజెండాను ఎత్తుకోవడం వెనక రాజకీయ ప్రయోజనాలను తారుమారు చేసే వ్యూహం ఉన్నట్లు భావిస్తున్నారు. ఏం జరిగినా బిజెపికి వచ్చేది గానీ పోయేది గానీ ఏమీ ఉండదు. అందువల్ల తనకు అనుకూలంగా వ్యవహరించే పార్టీకి మేలు జరిగే విధంగా ఎజెండాను ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ టార్గెట్ ఎందుకు...
పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయంతో బిజెపి నాయకత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబును వదిలేస్తూ పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడడమే అందుకు కారణమని చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన రావడానికి పవన్ కల్యాణ్ కారణమనే అభిప్రాయం ఏర్పడింది.
జగన్పై ఒత్తిడి పెంచి...
ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై ఒత్తిడి పెంచారని భావిస్తున్నారు. ఆ ఒత్తిడి కారణంగానే మార్చి 21వ తేదీన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ఆయన ముందుకు వచ్చారు. దానివల్ల కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారనే అభిప్రాయంతో బిజెపి నాయకత్వం ఉంది. తమనే పవన్ కల్యాణ్ లక్ష్యం చేసుకున్నారనే ఆగ్రహంతో బిజెపి నాయకత్వం ఉంది.
రాయలసీమ నుంచి పోటీ చేస్తానని పవన్
రాయలసీమ నుంచి తాను పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయన ఆ పని చేస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఏదో మేరకు నష్టం జరుగుతుందనే భావన ఉంది. రాయలసీమ ఎజెండాను ముందుకు తేవడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి అది సెంటిమెంటుగా మారితే పవన్ కల్యాణ్ రాయలసీమలో ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందనేది నిస్సందేహం.
జగన్కు మేలు జరుగుతుందా...
బిజెపి రాయలసీమ ఎెజెండా వ్యూహం వైఎస్ జగన్కు మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందనే గతంలో వైయస్సార్ కాంగ్రెసు నాయకులు గొంతెత్తిన సందర్భాలున్నాయి. రాయలసీమ ఉద్యమాన్ని లేవదీయడానికి తెర వెనక ప్రయత్నాలు కూడా చేశారని అంటున్నారు. అయితే, కోస్తాంధ్ర ప్రాంతంలో తమకు వ్యతిరేకత ఎదరవుతుందనే ఉద్దేశంతో వైఎస్ జగన్ వారిని నిలువరించినట్లు చెబుతున్నారు.
ఎందుకు జగన్కు మేలు.
బిజెపి వ్యూహం వల్ల జగన్కు మేలు జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. జగన్ రాయలసీమలోని కడప జిల్లాకు చెందినవారు. చంద్రబాబు కూడా రాయలసీమకు చెందినవారే. ఆయన చిత్తూరు జిల్లాకు చెందినవారు. అయితే, చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బిజెపి వ్యూహం వల్ల బలపడే అవకాశాలున్నాయి. జగన్ రాయలసీమ ఎజెండాను సమర్థించకపోయినా రాయలసీమ ప్రయోజనాలు కాపాడుతారనే అభిప్రాయం కలిగే అవకాశాలున్నాయి.