చంద్రబాబుపై మోడీ బిగ్ ప్లాన్ ? ఆ ట్రయల్ సక్సెస్ అయితే ? అప్పుడే ఏపీలో పొత్తు పొడుపు !
ఈ మధ్య కాలంలో తన పాత స్నేహితుడు, రాజకీయ శత్రువు కూడా అయిన చంద్రబాబును ప్రధాని మోడీ దగ్గరకు తీసుకోవడం చూస్తున్నాం. నాలుగేళ్లుగా చంద్రబాబును పక్కనబెట్టేసి ఇక ఆయనకు పూర్తిగా దారులు మూసేశారని అంతా భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా మోడీకి ఈ సీనియర్ పొలిటిషియన్ పై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందనే చర్చ కూడా జరుగుతోంది.అయితే దీని వెనుక కీలక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమ రాజకీయ అవసరాల కోసం మోడీ-షా ద్వయం దేనికైనా సిద్ధమైపోతారన్న వాదన మరోసారి నిజం చేసేలా తెరవెనుక చాలా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మోడీ-చంద్రబాబు స్నేహం
2014లో ఏపీ విభజన తర్వాత తొలిసారి ఏపీలో ఒంటరిగా పోటీ చేసేందుకు టీడీపీ సిద్దమవుతోంది. అదే సమయంలో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్ధాపించారు. అదే సమయంలో గుజరాత్ సీఎం పదవి నుంచి ప్రధానిగా మోడీని బీజేపీ ప్రమోట్ చేస్తోంది. మోడీ ఎలాగైనా ప్రధాని కావాలి. చంద్రబాబు ఎలాగైనా ఏపీ సీఎం కావాలి. అంతే ఇద్దరూ కలిసిపోయారు. గతంలో గోద్రా అల్లర్ల సమయంలో మోడీని సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు కాస్తా అదే మోడీని తీసుకొచ్చి ప్రధాని చేయాల్సిందేనని ఏపీ జనాన్ని ఒప్పించారు. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవాలంటే ఇది తప్పనిసరన్నారు. సీన్ కట్ చేస్తే మూడేళ్ల తర్వాత మోడీ ఏపీకి ఏమీ చేయలేదంటూ ధర్మపోరాటం చేసిన చంద్రబాబు అందులో దారుణంగా దెబ్బతిన్నారు. మళ్లీ మూడేళ్ల దూరం తర్వాత మోడీ చంద్రబాబును అక్కునచేర్చుకునేందుకు సిద్దమైపోయారు. దీంతో ఇంతలో ఎంత మార్పు అనే చర్చ సాగుతోంది.
చంద్రబాబు అవసరం వచ్చిందా ?
ఇన్నాళ్లూ తమపై ధర్మపోరాటం చేశారనే ఆగ్రహంతో చంద్రబాబును ఢిల్లీలో అపాయింట్ మెంట్లు కూడా ఇవ్వకుండా పక్కనబెట్టేసిన బీజేపీ, ప్రధాని మోడీ.. నాలుగేళ్ల తర్వాత తిరిగి అక్కున చేర్చుకుంటున్నారు. అసలే అవసరం లేకుండా మోడీ ఏదీ చేయరు. అలాంటిది చంద్రబాబుతో ఏం అవసరం వచ్చిందా అని అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ మోడీకి, బీజేపీకి చంద్రబాబు అవసరం నిజంగానే వచ్చింది. అయితే ఇది ఏపీలో మాత్రం కాదు. పొరుగున ఉన్న తెలంగాణలో అని తాజాగా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో బీజేపీ గెలుపుకు సాయం ?
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకెళ్తున్న బీజేపీ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీలో ఎలాగైనా గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అదంత సులువూ కాదు. అలాగని కష్టమూ కాదు. కానీ తెలంగాణలో ఇప్పటికే దాదాపు దుకాణం మూసేసిన టీడీపీ తిరిగి అక్కడ మునుపటిలా రాజకీయంచేయడమూ సులువు కాదు. కానీ బీజేపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ సాయం తీసుకోవాలనుకుంటోంది. హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో టీడీపీ సాయం తీసుకుంటే అది కచ్చితంగా తమకు పనికొస్తుందని బీజేపీ అంచనాలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాబు అక్కడ గెలిస్తే ఇక్కడ పొత్తు ?
ఒకప్పుడు బీజేపీతో కలిసి పోటీచేసి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం పంచుకున్న చంద్రబాబు.. అనంతరం ధర్మపోరాటం పేరుతో దూరమయ్యారు. తిరిగి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా దగ్గరకు రానీయని మోడీ.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కోసం తిరిగి చంద్రబాబును ఆకర్షించే పనిలో పడ్డారు. ఏదో విధంగా మోడీకి తిరిగి దగరయ్యేందుకు ఎదురుచూస్తున్న చంద్రబాబు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తాజాగా తెలంగాణలో గోదావరి ముంపు బారిన పడిన భద్రాచలం, చుట్టు పక్కల గ్రామాల్ని చుట్టి వచ్చారు. అంతేకాదు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి సత్తా చాటుతుందని చెప్పి మరీ వచ్చారు. వచ్చే ఆరునెలల్లో తెలంగాణ టీడీపీ క్యాడర్ ను యాక్టివ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. చివరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం ఏపీలోనూ దాన్ని రిపీట్ చేసేందుకు బీజేపీ సిద్ధపడుతుందని తెలుస్తోంది.