సోము వీర్రాజుకు ఇస్తే పార్టీలో ఉండను:బిజెపి ఎమ్మెల్యే ఆకుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్ష పదవిని సోము వీర్రాజుకి ఇస్తే తాను పార్టీలో కొనసాగనని రాజమండ్రి అర్భన్ బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తమ పార్టీ అధిష్టానానికి హెచ్చరిక చేసినట్లు తెలిసింది. ఎపి బిజెపి అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలో మకాం వేసిన ఆకుల సత్యనారాయణ ఇదే విషయమై అమిత్ షాతో భేటీ అయి తాడో పేడో తేల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు తన అనుచరులతో,మద్దతుదారులతో మాట్లాడిన ఆకుల సత్యనారాయణ...కాపు సామాజికవర్గానికి సోము వీర్రాజు ఏనాడూ అండగా నిలవలేదని, ఆయన ఎన్నడూ కాపు ఉద్యమంలో పాల్గొన లేదని, అలాంటి నేతకు కాపు నాయకుడనే ముద్రతో అధ్యక్ష పదవి కట్టబెట్టడం ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేయగా, ఆయన మద్దతుదారులు కూడా ఆయన అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించినట్లు తెలిసింది.

ఇదే విషయాన్ని తాను ఢిల్లీలో గట్టిగా వాదించబోతున్నట్లు తన అనుచరులతో చెప్పిన ఆకుల సత్యనారాయణ తొలుత ఢిల్లీలో కొందరు బిజెపి పెద్దలను కలసి ఈ విషయాన్ని వెల్లడించినా ప్రయోజనం లేకపోవడంతో ఇక ఫైనల్ గా అమిత్ షాతోనే తేల్చుకోవాలని డిసైడయ్యారట. అసలు సోమూ వీర్రాజు వల్ల పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలే లేవని, పైపెచ్చు అతని వ్యవహార శైలి వల్ల మొత్తం బీజేపీ ప్రతిష్టకే నష్టం వాటిల్లుతోందని గోదావరి జిల్లాలకు చెందిన బీజేపీ కాపు నేతలు ఆయనతో చెప్పగా వారి అభిప్రాయాన్ని కూడా ఆకుల ఢిల్లీలో వినిపిస్తున్నారట.
తాను నిజంగా భారతీయ జనతా పార్టీకి వీర విధేయుడినని, రాష్ట్రంలో బిజెపి మనుగడ దృష్ట్యానే సోమూ వీర్రాజుకు ఆ పదవి ఇవ్వద్దని తాను పట్టుబడుతున్నట్లు ఆకుల సత్యనారాయణ ఢిల్లీ పెద్దలకు వివరించారట. అంతేకాదు పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఏపీ బీజేపీ అధ్యక్షపదవి వీర్రాజుకు తప్ప ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఆకుల సత్యనారాయణ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అయినా తన మాటను ఖాతరు చేయకుండా సోమూ వీర్రాజుకే అధ్యక్ష పదవి కట్టబెడితే ఇక పార్టీలో కొనసాగనని కూడా ఆకుల సత్యనారాయణ తేల్చిచెప్పారని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications