బిజెపి నేత నాగం కిడ్నాప్ దుమారం, ఉత్తదే
హైదరాబాద్: బిజెపి నేత, మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిని దుండగులు కిడ్నాప్ చేసినట్లు సోమవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. హైదరాబాద్ సమీపంలోని తుర్క యంజాల్ వద్ద ఆయన కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. పొగబాంబు విసిరి ఆయనను పథకం ప్రకారం అపహరించుకుపోయినట్లు చెబుతున్నారు. అయితే, నాగం జనార్దన్ రెడ్డి అపహరణకు గురయ్యారా, లేదా అనేది స్పష్టం కావడం లేదు.
దుండగులు స్కార్పియో వాహనంలో వచ్చారని సమాచారం. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా తిరిగి పోటీ చేసి నాగర్ కర్నూలు సీటు నుంచి శాసనసభకు గెలిచారు. ఆ తర్వాత ఆయన బిజెపిలో చేరారు. నాగం జనార్దన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును అడ్డగించి, అపహరించుకుపోయినట్లు సమాచారం.

కారుకు అడ్డంగా ఓ వ్యక్తి పడుకున్నాడని, దాంతో కారు ఆపగానే స్మోక్ బాంబు విసిరి నాగం జనార్దన్ రెడ్డిని అపహరించుకుపోయారని వార్తలు వచ్చాయి. నాగం జనార్దన్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా మహబూబ్నగర్ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయనున్నారు.
అయితే, నాగం జనార్దన్ రెడ్డి అపహరణకు గురయ్యారా, మరో వ్యక్తి అపహరణకు గురయ్యారా అనే విషయం స్పష్టంగా తేలడం లేదు. తాను ఇంట్లోనే ఉన్నానని నాగం జనార్దన్ రెడ్డి తనకు వచ్చిన ఫోన్ కాల్కు సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు.
తమకు వచ్చిన కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నాగం జనార్దన్ రెడ్డి అపహరణ ఉదంతం ఉత్తదేనని తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications