చంద్రబాబు మహనటుడు, కావాల్సినవారికే కాంట్రాక్టులు: విష్ణుకుమార్ రాజు
విశాఖ: రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మహనటుడని బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపి నేతలు బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఆదివారం నాడు విశాఖ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరిస్తున్నారని, స్పీకర్ కూడా నల్లబ్యాడ్జి ధరించి నిరసన చేయొచ్చా? అని ప్రశ్నించారు.
పట్టిసీమ ప్రాజెక్టులో లేబర్ సెస్ ను కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయలేదన్నారు. రాష్ట్రంలో అన్ని పనులను కావాల్సిన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేసిందని ఆయన మరోసారి గుర్తు చేశారు.
మిగిలిన ఇతర హమీలను కూడ నెరవేరుస్తామని ఆయన చెప్పారు. కేంద్రంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన చెప్పారు. ఈ రకమైన ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీకి ఆర్థిక సహయం చేస్తామని కేంద్రం చెబుతున్న రాష్ట్రం పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం టిడిపి తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.