జనసేన! కనుమరుగయ్యే పార్టీ: బీజేపీ ఎమ్మెల్సీ సంచలనం
విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ జనసేన పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం విశాఖలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన నవభారత యువచైతన్య మహాసభలో మాధవ్ పాల్గొని ప్రసంగించారు.
ఏకైక పార్టీ బీజేపీ..
దేశంలో అన్ని పార్టీలు కుటుంబ పార్టీలగానూ ఉన్నాయన్నారు. అయితే, ఒక్క బీజేపీ మాత్రమే దానికి మినహాయింపు అని మాధవ్ స్పష్టం చేశారు. గతంలో పీఆర్పీ, ఇప్పుడు లోక్సత్తా, జనసేనలాంటి అనేక పార్టీలు ఉన్నాయన్నారు.
ఆ వ్యక్తి లేడంటే అంతే..
అంతేగాక, జనసేన లాంటి వ్యక్తి ఆధారంగా ఏర్పడే పార్టీలకు.. స్థాపించిన వ్యక్తులే ఆదర్శమని మాధవ్ అన్నారు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ కుర్చీ దిగిపోతే, ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని చెప్పారు.
లోక్సత్తా అంతే..
ఇందుకు లోక్సత్తా పార్టీని ఉదాహరణగా మాధవ్ పేర్కొన్నారు. జయప్రకాశ్ నారాయణ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతే ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు.
జనసేనాగ్రహం
అలాగే అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కనుమరుగు అయిపోయే పార్టీ అని మాధవ్ తేల్చేశారు. కాగా, జనసేనపై మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు.