ఏపీకి నెంబర్ ఒన్ ర్యాంకు ఎలా - వాస్తవ పరిస్థితులు అలా లేవు : సొమ్ము ఇచ్చేయాలి - జీవీఎల్..!!
కేంద్రం విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి తొలి ర్యాంకు వచ్చింది. కానీ, కేంద్ర ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ మాత్రం ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులు అలా లేవంటూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కామెంట్ చేసారు. ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. ఆర్టీసీ చార్జీలు రెండు నెలల్లో రెండుసార్లు పెంచటాన్ని తప్పు బట్టారు. కేంద్రం డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం బస్ ఛార్జీలు పెంచడమేంటని ప్రశ్నించారు. ద్యోగుల జీపీఎఫ్ నుంచి రూ. 800 కోట్లు లాగేయటం దారుణమని వ్యాఖ్యానించారు.
అడిగితే సాంకేతిక లోపం అంటున్నారని.. అప్పు పుట్టని రోజు ఏదో ఒక ఎకౌంట్లోకి దూరి లాగేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల ఎకౌంట్లలో సొమ్ములకు సాంకేతిక లోపం జరగదేమని ప్రశ్నించారు. వెంటనే లాగేసిన సొమ్ము ఎకౌంట్లలో వేయాలని జీవీఎల్ డిమాండ్ చేసారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ముందుందనడానికి వాస్తవ పరిస్థితులు అలా లేవని చెప్పుకొచ్చారు. ఈ ర్యాంకింగ్స్ విధానాన్ని పునః సమీక్షించాలని జీవీఎల్ కేంద్రాన్ని కోరారు. ఎఫ్ఫార్బీఎం ఆంక్షలకు లోబడి రాష్ట్రాలు అప్పులు చేయాలని సూచించారు. కానీ కొన్ని రాష్ట్రాలు కల్లు కప్పి రుణాలు తీసుకుంటున్నాయంటూ వ్యాఖ్యానించారు.
దీనికి కూడా ఇపుడు కేంద్రం బ్రేకు వేసిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలోని నేతలు కేంద్రం ఇచ్చిన రేటింగ్ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనంగా పేర్కొన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని.. స్వయంగా సీఎం జగన్ పారిశ్రామిక వేత్తలకు ఏ అవసరమైన ఒక్క ఫోన్ చేస్తే అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.