టీడీపీతో బీజేపీ పొత్తు, ఏంటి వ్యూహం - తేల్చేసిన కమలం పార్టీ ముఖ్య నేత..!!
బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి టీడీపీతో జత కడుతోందా. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ముందుగా ప్రతిపాదించారు. విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వైసీపీ ప్రభుత్వంపైన చేసిన వ్యాఖ్యలతో 2014 పొత్తులు ఏపీలో రిపీట్ కానున్నాయనే వాదన మొదలైంది. ఈ సమయంలో బీజేపీ ముఖ్య నేత ఓబీసీ మోర్చా అధ్యక్షుడు..ఎంపీ లక్ష్మణ్ కర్నూలులో క్లారిటీ ఇచ్చారు. పార్టీ వ్యూహం తేల్చి చెప్పారు.
బీజేపీ ఆలోచన మారలేదు : పొత్తుల విషయంలో బీజేపీ ఆలోచన మారే అవకాశం లేదని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేసారు. ఏపీలో జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. స్వయంగా పార్టీని అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. వైసీపీ ప్రభుత్వం లో ఎవరు జేబులు నింపుకుంటున్నారో ప్రజలకు తెలుసని కీలక వ్యాఖ్యలు చేసారు.

మోదీ కంటే ఎక్కువ అభివృద్ధి సంక్షేమం చేసినట్లు నిరూపిస్తారా అని సవాల్ చేసారు. ప్రపంచమంతా ఆర్థికంగా అతలాకుతలం అవుతుంటే ముందు చూపుతో మోదీ అభివృద్ధి పైనే పెట్టుబడులు పెట్టారని లక్ష్మణ్ వివరించారు. దళారి వ్యవస్థ లేకుండా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
పొత్తుల వేళ కీలక వ్యాఖ్యలు : ప్రపంచంలో భారత్ విశ్వగురు గా ఎదిగే స్థాయికి ఎదిగిందని లక్ష్మణ్ వివరించారు. కేంద్రప్రభుత్వం ప్రగతి నివేదిక నిజాయితీగా నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు. ప్రధాని మోదీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. భారత్ జిడిపి 7.2గా ఉందన్నారు. భవిష్యత్తులో ప్రపంచం లో అతి పెద్ద ఆర్థిక దేశంగా భారత్ నిలుస్తుందని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేసారు.
2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెబుతూ వచ్చారు. బీజేపీ చీఫ్ నడ్డా, అమిత్ షా ఏపీ పర్యటన సమయంలో చేసిన వ్యాఖ్యలతో టీడీపీ ..బీజేపీ పొత్తు పైన అంచనాలు మొదలయ్యాయి.

పొత్తులు లేనట్లేనా : టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డా, హోం మంత్రి అమిత్ షా తో సమావేశం తరువాత పొత్తల పైన అంచనాలు మొదలయ్యాయి. కానీ రెండు పార్టీల నుంచి మాత్రం అధికారికంగా పొత్తుల పైన ఎటువంటి ప్రకటన రాలేదు. పొత్తుల గురించి ప్రస్తుతం ప్రతిపాదించిన జనసేనాని పవన్ కూడా మౌనంగా ఉంటున్నారు.
సీఎం జగన్ తనకు బీజేపీ మద్దతు లేకోవచ్చంటూ చేసిన వ్యాఖ్యలతో తిరిగి 2014 పొత్తులు ఏర్పడుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఈ సమయంలో బీజేపీ జాతీయ స్థాయిలో ముఖ్య నేతగా ఉన్న ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి.












Click it and Unblock the Notifications