'పురంధేశ్వరి ఏ లోకసభ సీటుకు దరఖాస్తు చేయలేదు'
హైదరాబాద్: విశాఖ, ఇతర ఏ లోకసభ సీటు కేటాయింపు కోసమూ కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి దరఖాస్తు చేసుకోలేదంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాం కిషోర్ స్పష్టం చేశారు. ఆమె స్వచ్ఛందంగా ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరారని తెలిపారు. ఎంపీ సీటు కేటాయింపు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అవి నిరాధారమన్నారు.
పురంధేశ్వరి ఇటీవలే బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోకసభ నుండి హరిబాబు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె విజయవాడ వైపు దృష్టి సారిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో విశాఖ సహా పలు లోకసభ స్థానాల్లో పోటీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. వాటిని పార్టీ ఖండించింది.

మరోవైపు బిజెపితో దోస్తీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీలతో మహా కూటమిని ఏర్పాటు చేసి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలను దెబ్బ తీయాలనే వ్యూహరచన సాగుతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తనకు 3 లేదా 4 పార్లమెంటు సీట్లు కావాలని బిజెపి నేతలను అడిగినట్లు చెబుతున్నారు. బిజెపి అందుకు అంగీకరించినట్లుగా కూడా సమాచారం. అయితే, తన పార్టీ స్థాపన వెనక పని చేసిన పొట్లూరి వరప్రసాద్కు విజయవాడ టికెట్ కేటాయించాలని ఆయన అడిగినట్లు చెబుతున్నారు.
అయితే, అందుకు బిజెపి అంగీకరించడం లేదని సమాచారం. పొట్లూరి వరప్రసాద్పై కేసులు ఉన్నందు వల్ల సీటు కేటాయిస్తే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని బిజెపి నేతలు అంటున్నారట. అదే సమయంలో విజయవాడ సీటును మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి కేటాయించాలనే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications