బీజేపీ ఆపరేషన్ ఏపీ, జగన్ పై ద్విముఖ వ్యూహం - టీడీపీకి ఛాన్స్ లేకుండా..!!
ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. రాజకీయ యుద్దం ఇప్పుడు వైసీపీ వర్సస్ పవన్, బీజేపీ అన్నట్లుగా మారుతోంది. టీడీపీ వెనుకబడింది. పవన్ టీడీపీ పొత్తు ఖాయమని భావిస్తున్నా...ఎన్నికల వేళ పార్టీకి మంచిది కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ ఏపీ విషయంలో ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ మధ్య కాలంలో పవన్ తో పొత్తు - పురందేశ్వరి కి బాధ్యతల ద్వారా కొత్త గేమ్ మొదలు పెట్టింది.
జగన్ వర్సస్ పవన్ వార్:ఏపీలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ- పవన్ కూటమి కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర నుంచి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సహజంగానే వైసీపీ పవన్ కు కౌంటర్ ఇస్తోంది. పవన్ వర్సస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం మారింది. ఈ సమయంలోనే బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఉన్న కన్నా, సోముకు భిన్నం గా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ బీజేపీ అధ్యక్ష హోదాలో పురందేశ్వరి కార్నర్ చేయటం ప్రారంభించారు. అటు పవన్, పురందేశ్వరి వైసీపీ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు టీడీపీ కి మౌనాన్ని మిగిల్చాయి. టీడీపీ పాత్ర ఈ ఇద్దరు పోషిస్తున్నారు.

వాయిస్ పెంచిన బీజేపీ:మిత్రపక్షాలుగా ఉన్న జనసేన- బీజేపీ నేతలు ప్రతిపక్ష్ వాయిస్ బలంగా వినిపిస్తుండటంతో టీడీపీ వాయిస్ తగ్గిపోయింది. టీడీపీతో పవన్ పొత్తు ఖాయమనే అభిప్రాయం ఉన్నా..టీడీపీ పూర్తిగా మౌనంగా ఉండటం పార్టీ నేతలకు రుచించటం లేదు. అయితే, ఇదంతా బీజేపీ నాయకత్వం ప్లాన్ ప్రకారమే సాగుతున్నట్లు అంచనా. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన సాయంలో వైసీపీ పార్లమెంట్ లో మద్దతుగా నిలుస్తోంది.
జగన్ పైన బీజేపీ ముఖ్య నాయకత్వం సానుకూల ధోరణితోనే వ్యవహరిస్తోంది. తాజాగా జరిగిన ఎన్డీఏ సమావేశానికి టీడీపీని బీజేపీ నేతలు ఆహ్వానించ లేదు. దీని ద్వారా పవన్ తోనే రాజకీయంగా ఏపీలో పట్టు సాధించే ప్రయత్నాల్లో బీజేపీ నేతలు ఉన్నారనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది.

టీడీపీ మౌనం..ఏం జరుగుతోంది:పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ మేరకు బీజేపీ ముఖ్య నేతల వద్ద ప్రతిపాదనలు చేసారు. అది సాధ్యపడుతుందనే నమ్మకం తాజాగా పవన్ వ్యాఖ్యల్లో నూ స్పష్టం అయింది. అయితే, ఏపీలో హోం మంత్రి అమిత్ షా, నడ్డా పర్యటన సమయంలో వైసీపీ పైన ఆరోపణలు చేసారు. ఆ తరువాతనే పవన్...పురందేశ్వరి నేరుగా వైసీపీ ప్రభుత్వం పైన విమర్శల వేడి పెంచారు. దీని ద్వారా బీజేపీ ఏపీలో పక్కా ప్లాన్ ప్రకారమే వెళ్తున్నట్లు స్పష్టం అవుతోంది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ పాత్ర కీలకంగా మారుతోంది. పవన్ తమతోనే ఉంటారని టీడీపీ ఆశిస్తోంది. టీడీపీతో మైత్రి విషయంలో బీజేపీ తీసుకొనే నిర్ణయం అనుకూలంగా లేకపోతే..పవన్ ఏం చేస్తారనేది మరో కీలక అంశం. ఈ మొత్తం రాజకీయంలో అంతిమంగా లాభ పడేదెవరు..నష్టపోయేదెవరనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications