బిజెపి షాక్: బాబుతో ప్రమాదం, 2019లో ఏం చేద్దాం?
ఏపీకి చెందిన బిజెపి నేతలు టిడిపితో పొత్తున్నా లాభం లేదని అభిప్రాయపడ్డారు. బలపడేందుకు ప్రయత్నాలు చేయాలని రాష్ట్ర కార్యవర్గసమావేశాల్లో తీర్మాణించారు.
గుంటూరు: 2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తు లేకపోతే పరిస్థితేమిటీ, స్వతంత్రంగా బలపడేందుకు ప్రయత్నించాలని బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. కేరళలో సిపిఎం కంటే ఏపీలో చంద్రబాబుతోనే ప్రమాదమెక్కువ అనే అభిప్రాయంతో బిజెపి నేతలున్నారు.
తొందరపడ్డారు:కెసిఆర్-పయ్యావుల రహస్య భేటీపై బాబు సీరియస్
2014 ఎన్నికలకు ముందు టిడిపితో బిజెపి పొత్తు కుదుర్చుకొంది. ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో బిజెపి, టిడిపి కలిసి పోటీచేశాయి. ఏపీ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వంలో చేరింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని బిజెపి ప్రకటించింది.
Recommended Video
2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తు విషయమై ఇప్పుడే చెప్పలేమని బిజెపి నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే 2019 ఎన్నికల నాటికి మాత్రం ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగుతోందని బిజెపి నేతలు ప్రకటించారు.
అయితే అదే సమయంలో ఏపీలో కూడ బలపడాలని బిజెపి ప్రయత్నాలను ప్రారంభించింది. దక్షిణాది రాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకోవాలని బిజెపి ఇటీవల కాలంలో ప్రయత్నాలను ప్రారంభించింది. గుంటూరులో జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలువురు బిజెపి నేతలు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారని సమాచారం.
చంద్రబాబుతోనే ప్రమాదం
కేరళలో కమ్యూనిస్టులకన్నా ఇక్కడ చంద్రబాబుతోనే మనకు ప్రమాదం! రేపు రాష్ట్రంలో పొత్తులేదు పొమ్మంటే మనకు ఏం బలముందని ప్రజల్లోకి వెళతాం అంటూ పలువురు బిజెపి నేతలు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని సమాచారం.రాష్ట్ర ప్రభుత్వంలో మనమూ ఉన్నామన్న పేరేకానీ... ఒక్కపనీ చేయించుకోలేకపోతున్నామని పలువురు బిజెపి నేతలు తమ ఆవేదనను పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వ్యక్తం చేశారని తెలుస్తోంది.
టిడిపితో పొత్తు లేకపోతేనే బలపడతాం
టీడీపీతో పొత్తు లేకపోతే స్వతంత్రంగా బలపడతామని మెజారిటీ నాయకులు అభిప్రాయపడ్డారని సమాచారం. అయితే టిడిపితో పొత్తు కారణంగా రాజకీయంగా బలపడలేకపోతున్నామనే అభిప్రాయాన్ని కొందరు నేతలు సమావేశంలో వ్యక్తం చేశారు. అయితే పార్టీని బలోపేతం చేయాలంటే టిడిపితో పొత్తును తెంచుకోవాలనే అభిప్రాయాన్ని కొందరు సమావేశంలో ప్రస్తావించారని సమాచారం.
ఏపీలో ఏం చేద్దాం?
ఏపీలో బలపడేందుకు ఏం చేద్దామనే విషయమై పార్టీ నేతలు ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు. అయితే ఏపీలో ఉన్న అవకాశాలను, ఇతర పార్టీల బలాలు, బలహీనతలపై కూడ చర్చించారని సమాచారం.ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకొన్న ఘటనలపై యాత్రలు చేయడం కంటే రాష్ట్రంలో పార్టీని రక్షించుకొనేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం.
పెట్రోల్ ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని తీర్మానం
కేరళలో బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై హత్యకాండను నిరసిస్తూ అక్టోబర్ 17న, రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. బూత్స్థాయి నుంచి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి వరకు వివిధ కార్యక్రమాలను అమలు చేసి 2019 నాటికి రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా అవతరించాలని తీర్మానించారు.పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సయిజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.