సురేఖనెలా చేర్చుకున్నారు: బీజేపీ, తెరాసలోకి ఎమ్మెల్యే
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, సంగారెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడు జగ్గారెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడంపై తెలంగాణ రాష్ట్ర సమితి విమర్శలు గుప్పించడం పైన భారతీయ జనతా పార్టీ ధీటుగా స్పందిస్తోంది. తెరాసలో చేర్చుకున్న మాజీ మంత్రి కొండా సురేఖ, చేరబోతున్న తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వర రావులను బీజేపీ ఉదహరిస్తోంది.
సమైక్యవాది జగ్గారెడ్డిని ఎలా చేర్చుకుంటారని తెరాస నేతలు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. తెరాస నేతలు అద్దాల గదిలో ఉండి రాళ్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణవాదుల పైన రాళ్లు వేసిన కొండా సురేఖను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. అలాగే ఇప్పుడు తుమ్మలను ఎలా చేర్చుకుంటున్నారో చెప్పాలన్నారు.
కాంగ్రెస్కు కోరం ఝలక్
తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం ప్రకటించారు. తాను రేపు కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు తెలిపారు.
విరమించుకున్నా: దేవీప్రసాద్
మెదక్ లోకసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకున్న మాట వాస్తవమేనని, అయితే కేసీఆర్ సూచనతో తాను విరమించుకున్నానని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు.
జగ్గారెడ్డిని ఓడించాలి: హరీష్ రావు
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జగ్గారెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పైన కేంద్రం కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. సిద్దిపేట పోరాటాల పురిటి గడ్డ అన్నారు. తెలంగాణపై చంద్రబాబు కుట్రలకు కేంద్రం వంత పాడుతోందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెసు అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి ఏనాడు జిల్లా ప్రజలను పట్టించుకోలేదన్నారు. మెదక్ ఉప ఎన్నికలకు చాలా కీలకమని కే కేశవ రావు అన్నారు. బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు కావాలన్నారు.