జనసేనకు బీజేపీ షాక్ ? ఒంటరిపోరుపై సంకేతాలు-గేరు మార్పుకు కారణమిదే..
ఏపీలో బీజేపీ, జనసేన మధ్య సాగుతున్న పొత్తుకు గండిపడే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా తాము పోరాడుతుంటే జనసేన కలిసి రాకపోవడంపై కాషాయ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టిప్పుసుల్తాన్, గోవధ వంటి అంశాల్లో వైసీపీని ఇరుకునపెట్టేందుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉమ్మడి పోరు సాగిద్దామని భావించినా జనసేన కలిసి రాకపోవడంతో ఇక ఒంటరి పోరే మేలన్న సంకేతాలను బీజేపీ నేతలు క్యాడర్ కు పంపుతున్నారు.
క్లైమాక్స్ కు బీజేపీ-జనసేన పొత్తు
ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నకల్లో విజయమే లక్ష్యంగా రెండేళ్ల క్రితం పొత్తు పెట్టుకున్న బీజేపీ, జనసేన పార్టీలు.. మొదట్లో ఉమ్మడి పోరాటాలు చేశాయి. కానీ క్రమంగా జనసేన మద్దతుతో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం, జనసేనకు సత్తా నిరూపించుకునే అవకాశాలు దక్కకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో జనసేన క్యాడర్ లో నిస్సత్తువ ఆవహించింది. దీని ప్రభావం తాజాగా బీజేపీ చేస్తున్న పోరాటాలపై పడుతోంది. కీలక అంశాల్లో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న పోరాటాల్లో జనసేన కనిపించకపోవడంతో ఇక వీరి పొత్తు క్లైమాక్స్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
హనీమూన్ ముగిసిందా ?
వైసీపీ సర్కార్ పై పోరు కోసం ఉమ్మడి లక్ష్యంతో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ బీజేపీ-జనసేన పార్టీ నేతలు చేసిన ఉమ్మడి పోరాటాల సంఖ్య మాత్రం వేళ్లపై లెక్క పెట్టేలా ఉంది. మరోవైపు జనసేనకు ఉన్న మాస్ పాపులారిటీని బీజేపీ వాడుకోవడమే తప్ప తమకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వాపోతున్నారు. దీంతో తాము చేసే పోరాటాలతో బీజేపీకే ఎక్కువ మైలేజ్ వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీజేపీ తాజా పోరాటాల్లో జనసేన క్యాడర్ కనిపించడం మానేసింది. ఇదే అదనుగా బీజేపీ కూడా తమ వ్యూహం సిద్దం చేసుకుంటోంది.
టీడీపీపై జనసేన మోజు
కాషాయ పార్టీ బీజేపీతో పోలిస్తే గతంలో తాము పొత్తు పెట్టుకున్న టీడీపీయే కాస్త నయమని జనసేన భావిస్తోంది. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా జనసేన మాత్రం నేరుగా పోటీ చేయలేదు. దీంతో టీడీపీకి భారీగా లబ్ది చేకూరింది. అదే సమయంలో బీజేపీకి కూడా విశాఖ ఎంపీ స్ధానంలో మేలు జరిగింది. అంతిమంగా జనసేనకు మాత్రం మిగిలిందేమీ లేదు. దీంతో తమ పాత భాగస్వామి టీడీపీతో పొత్తుకు మరోసారి ప్రయత్నిస్తేనే మేలనే భావన జనసేన క్యాడర్ లో వ్యక్తమవుతోంది. బీజేపీతో పోలిస్తే వైసీపీని ఎదుర్కొనే సత్తా టీడీపీకే ఉందని జనసేన నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్తున్నారు. దీంతో ఆ దిశగా జనసేన అడుగులు వేసే అవకాశముంది.
Recommended Video
ఒంటరిపోరుపై క్యాడర్ కు క్లారిటీ
మారిన పరిస్దితుల్లో రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్ ను యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. భవిష్యత్తులో ఒంటరి పోరుకు సిద్ధం కావాలని తమ క్యాడర్ కు సంకేతాలు పంపుతోంది. ఎన్నో అంచనాలతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినా జనసేన నుంచి ఆశించిన స్ధాయిలో స్పందన లేకపోవడంతో ఇక చేసేది లేక కమలం పార్టీ.. ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే గతంలో జనసేనతో పొత్తును దృష్టిలో ఉంచుకని కేవలం ప్రజా సమస్యలపై దృష్టిపెట్టిన కాషాయ నేతలు ఇప్పుడు మత పరమైన అంశాలపై గేరు మారుస్తున్నారు. అందుకే టిప్పుసుల్తాన్, గోవధ వంటి వివాదాస్పద అంశాల్ని బీజేపీ నేతలు కెలుకుతున్నట్లు తెలుస్తోంది.