పవన్ సనాతనం వెనుక ఢిల్లీ మాస్టర్ ప్లాన్?
Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం- తెలుగుదేశం పార్టీకి ఎంత మేరకు రాజకీయ ప్రయోజనాలను కల్పించిందో గానీ జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం దీన్ని బాగానే సొమ్ము చేసుకున్నారు. ఈ విషయంలో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు తరహాలో వ్యవహరించారు.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ నిప్పు రాజేస్తే దానికి ఆజ్యం పోశారు పవన్ కల్యాణ్. దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు. తాను సనాతనీ అవతారం ఎత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తప్పు చేశారని, దానికి తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానంటూ 11 రోజుల పాటు దీక్ష సైతం చేపట్టారు.

తిరుమల లడ్డూలో కల్తీ జరగిందనడానికి ఏ మాత్రం ఆధారాల్లేవంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం స్పష్టం చేసినప్పటికీ పవన్ కల్యాణ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తిరుపతిలో వారాహి బహిరంగ సభ సందర్భంగా పరోక్షంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు కఠినంగా వ్యవహరిస్తోన్నాయని, ధర్మాన్ని వ్యతిరేకించే వారికి న్యాయస్థానాలు రక్షణ సైతం కల్పిస్తోన్నాయని వ్యాఖ్యానించడం ఆయన తెగువకు అద్దం పట్టినట్టయింది. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందనీ తేల్చి చెప్పారు. దీనిపై డిక్లరేషన్ చేశారు.

ఈ పరిణామాలు పవన్ను వార్తల్లో వ్యక్తిగా చేశాయి. తిరుమల లడ్డూ వివాదం కొనసాగినన్ని రోజులూ ఆయన పేరు జాతీయ మీడియాలో సైతం ప్రస్తావనకు వచ్చింది. తిరుమల లడ్డూ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నట్టయింది. ఈ వివాదాన్ని రేకెత్తించిన చంద్రబాబు గానీ, దాన్ని రాజకీయం చేసిన తెలుగుదేశం పార్టీకి గానీ దక్కని గుర్తింపు.. పవన్ సొంతం చేసుకున్నట్టయింది.
ఇది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ దృష్టిలో పడటానికీ కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. తాము అనుసరిస్తోన్న హిందుత్వ విధానానికి పవన్ కల్యాణ్ ఓ రకంగా బ్రాండ్ అంబాసిడర్లా మారాడనీ బీజేపీ భావిస్తోన్నట్లు చెబుతున్నారు. పవన్ సనతాన నినదాన్ని అందుకున్న తరువాత రాజకీయంగా ఆయన మైలేజీ పెరిగిందనే నిర్ణయానికీ వచ్చిందనీ అంటున్నారు.
ఈ ఉద్దేశంతో జనసేనతో విలీన ప్రతిపాదనలను బీజేపీ తెర మీదికి తెచ్చిందంటూ ది న్యూస్ మినిట్ ఓ కథనాన్ని ప్రచురించింది. జమిలి ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనను విలీనం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉందని పేర్కొంది. వన్ నేషన్- వన్ ఎలక్షన్పై ముమ్మర కసరత్తు సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో జనసేన విలీనం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఏపీలో బీజేపీకి సరైన ఓటుబ్యాంక్ లేదు. కమలానికి మిత్రపక్షమైనా, శతృపక్షమైనా తెలుగుదేశం పార్టీ ఒక్కటే. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం- విడిపోవట- మళ్లీ పొత్తు పెట్టుకోవటం సర్వసాధారణమైంది బీజేపీకి. మరో ప్రత్యామ్నాయం లేకపోవడం, దశాబ్దాలు గడుస్తున్నా సొంతంగా తన కాళ్ల మీద తాను నిల్చోలేకపోవటం దీనికి కారణం.
అందుకే రాజకీయంగా తమ కంటే ప్రజల్లో మంచి ఆదరణ, ఛరిష్మా, సొంతంగా బలమైన కాపు సామాజిక ఓటుబ్యాంక్ను కలిగివున్న పవన్ కల్యాణ్ సారథ్యాన్ని వహిస్తోన్న జనసేనను విలనీం చేసుకోవాలని బీజేపీ బలంగా భావిస్తోందని, దీనికి సంబంధించిన సంప్రదింపులు జమిలి ఎన్నికల నాటికి పూర్తి కావొచ్చనీ అంటున్నారు.












Click it and Unblock the Notifications