రాజధానిపై బీజేపీ అదిరిపోయే ప్లాన్.. సినీఫక్కీ రాజకీయాలంటూ జీవీఎల్ కామెంట్లు.. బాబును మటాష్ చేసేలా..
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనిగానీ, అక్కడి నుంచి తరలించాలనిగానీ, లేదా మూడు రాజధానుల ఏర్పాటుపైగానీ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదంటూ బల్లగుద్దివాదిస్తోన్న బీజేపీ.. పార్టీ పరంగా మాత్రం భిన్నవాదన వినిపిస్తోంది. ఓవైపు సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కేంద్రం అంగీకరిస్తుందని భరోసా ఇస్తూ.. మరోవైపు రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, భూఅక్రమాల్లో చంద్రబాబును ఇరుకునపెట్టేందుకు ఈడీ, సీబీఐల ద్వారా పావులు కదుపుతోంది. అమరావతిపై బీజేపీ ఫ్యూచర్ ప్లాన్ కు సంబంధించి ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు బుధవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. జీవీఎల్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

అమరాతికి అనుకూలమేకానీ..
‘‘అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని పార్టీ పరంగా బీజేపీ తీర్మానం కూడా చేసింది. కానీ దాని కోసం పంతాలకు పోవడం లేదా ప్రజల్ని మభ్యపెట్టడం మాకు ఇష్టంలేదు. వేల మంది రైతులు భూములిచ్చారు కాబట్టి.. గత ఐదేళ్లలో దాదాపు 10వేల కోట్ల రూపాయల ఖర్చుతో అక్కడ కొన్ని నిర్మాణాలు జరిగాయి కాబట్లే రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని బీజేపీ ఆశిస్తోంది. అయితే రాజధానిని తరలిస్తూ వైసీపీ చేసే ప్రయత్నాలను మేం అడ్డుకోబోము. మా(బీజేపీ) అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాజ్యాంగ విలువలు, నిబంధనలకు అనుగుణంగానే కేంద్రం వ్యవహరిస్తుంది. రాజధాని తరలింపుపై ఇంకా కుటిల ప్రయత్నాలు చేసినట్లైతే అది క్షమించరాని రాజకీయ పాపం అవుతుందని అందరూ గమనించాలి.

చంద్రబాబే టార్గెట్
రాజధాని అమరావతిలోనే కొనసాగాలన్నది మా విధానమే అయినా.. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదా భూఅక్రమాలు జరగలేదని బీజేపీ ఏనాడూ చెప్పలేదు. చంద్రబాబు హయాంలో ముమ్మాటికీ అమరావతిలో అడ్డగోలుగా భూవిక్రయాలు జరిగాయి. ఈ విషయాన్ని బీజేపీ మేనిఫెస్టోలోనూ చెప్పాం. చంద్రబాబుపైనో లేదా భూఅక్రమాలకు పాల్పడిన ఎవరిపైనైనా చర్యలు తీసుకునే విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది. అయితే కేవలం అక్రమాలు జరిగాయన్న సాకుతో రాజధానిని తరలించొద్దని మేం కోరుకుంటున్నాం.

జగన్ను జనం కోరుకున్నారు..
కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ పై ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. కేంద్రం చెప్పిందికదాని ఏపీకి అమరావతే శాశ్వత రాజధాని అయిపోదు. రాజధానిని మార్చుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ నియమించలేదు. వైఎస్ జగన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ కాదు. ఏపీ ప్రజలు తమకుతాముగా ఓట్లేసి వైసీపీని ఎన్నుకున్నారు. దాదాపు 50 శాతం మంది జగనే సీఎం కావాలని కోరుకున్నారు. ఇంత మెజార్టీతో ఏర్పాటైన ప్రభుత్వం.. రాజధానిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందులో కేంద్రం జోక్యం ఉండదుగాక ఉండదు.

ఢిల్లీలో ఏమీ దొరకదు..
కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ పై కొందరు అసత్యప్రచారాలు చేస్తూ ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో అమరావతికి చెందిన కొందరు రైతులు.. ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ఎంపీలను కలుస్తున్నారు. ఈ భేటీలపై బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలవొచ్చు.. ఏవైనా మాట్లాడుకోవచ్చు. కాకుంటే.. ఢిల్లీకి వచ్చినవాళ్లకు ఎలాంటి ఫలితం దొరకదు. ఎందుకంటే రాజధాని తరలింపునకు సంబంధించిన సమాధానాలన్నీ అమరావతిలోనే దొరుకుతాయి‘‘ అని జీవీఎల్ స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ఏపీ రాజకీయాలనుద్దేశించి ఆయన ఇంకేమన్నారంటే..

సినీ ఫక్కీలో..
దేశంలో ఎక్కడాలేని విధంగా సినీఫక్కీలో భ్రమరాజకీయాలు ఏపీలో మాత్రమే జరుగుతాయంటూ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఏపీకి చెందిన ప్రాంతీ పార్టీలన్నీ బీజేపీని ఇరుకునపెట్టడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తాయని ముందే ఊహించామని, కేంద్రం లేఖలు లేదా నోటిఫికేషన్లంటూ ప్రజల్లో భ్రమలు క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుందని తెలుసుకాబట్టే పదేపదే క్లారిటీ ఇస్తున్నామని జీవీఎల్ అన్నారు. తద్వారా అమరావతికి బీజేపీ అనుకూలమని స్పష్టం చేస్తూనే.. రాష్ట్ర సర్కారు నిర్ణయంతో కేంద్రానికి సంబంధంలేదనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు బీజేపీ బలంగా ప్రయత్నిస్తున్నది. రాజధాని తరలింపును కేంద్రం అడ్డుకోలేకపోయినా.. పార్టీ పరంగా బీజేపీ తనవంతు పోరాటం చేస్తుందని.. ప్రజలకు కావాల్సిన మేలుల కోసం వైసీపీపై ఒత్తిడి పెంచుతామని, అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని జీవీఎల్ తెలిపారు. తద్వారా కీలకమైన రాజధాని తరలింపు వ్యవహారంలో బీజేపీ తనదైన ప్లాన్తో ముందుకెళుతున్నట్లు ఆయన అంగీకరించారు.












Click it and Unblock the Notifications