వైఎస్ జగన్తో టచ్లో అమిత్ షా? హంగ్ వస్తే వైసీపీ కింగ్ మేకరే!
Recommended Video
అమరావతి: దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసిపోలేదు. ఇంకా మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ మిగిలే ఉంది. దాదాపు 169 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి దశలోనే భారతీయ జనతాపార్టీలో మెజారిటీపై అనుమానాలు నెలకొన్నాయి. హంగ్ వస్తే పరిస్థితేమిటనే దిశగా యోచిస్తున్నారు కమలనాథులు. అందుకే- అందరి కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. ఎన్డీయేతర పార్టీలను కలుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు మొదలెట్టేశారు కూడా. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం- దక్షిణాది రాష్ట్రాల్లో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించవచ్చని భావిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మంతనాలు ఆరంభించారు. ఈ మేరకు బీజేపీ సుప్రిమో అమిత్ షా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మొదటి సారి స్పందించిన చంద్రబాబు ..ఏమన్నారంటే
హంగ్ వస్తే.. జగన్ కింగ్ మేకరే
లోక్ సభ ఎన్నికల అనంతరం దేశంలో హంగ్ అంటూ వస్తే.. వైఎస్ జగన్ కింగ్ మేకరే అవుతారని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. కనీసం 20 సీట్ల వరకు వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంటుందంటూ దాదాపు అన్ని రకాల సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే. హంగ్ ఏర్పడిన పరిస్థితుల్లో 20 సీట్లంటే మాటలు కాదు. ఆ మాత్రం స్థానాలను దక్కించుకున్న పార్టీ.. దేనికి మద్దతు ఇస్తే.. ఆ రాజకీయ పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. దీన్నంతటినీ విశ్లేషించుకున్న తరువాతే- కమలనాథులు వైఎస్ జగన్ వైపు దృష్టి సారించారని అంటున్నారు.
హంగ్ వస్తుందని డిసైడ్ అయ్యారా?
దేశంలో ఇంకా మూడు దశల ఎన్నికలు మిగిలి ఉన్న పరిస్థితుల్లో- మెజారిటీ స్థానాలు దక్కకపోవచ్చని బీజేపీ నాయకులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండో దశలో 169 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 6న 51, 12న 59, 19న మరో 59 సీట్లకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడు దశల పోలింగ్ సరళి పార్టీకి అనుకూలంగా ఉండకపోవచ్చంటూ బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు చెప్పుకోవచ్చు.
జగన్ డిమాండ్ ఒక్కటే..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని రావడం. ప్రస్తుతం వైఎస్ జగన్ ముందున్న లక్ష్యం అదొక్కటే. ప్రత్యేక హోదా కోసం అయిదేళ్లుగా ఆయన వివిధ రకాల పోరాటాలు చేస్తూ వచ్చారు. విద్యాసంస్థలో యువభేరీలను నిర్వహించారు. పరిమితంగా నిరాహార దీక్షలు చేశారు. మేథావులతో సమావేశాలు, సదస్సులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి లభించే ప్రయోజనాల గురించి వివరించే ప్రయత్నాలు చేశారు. ఓ రకంగా- వైఎస్ జగన్ పట్టుపట్టడం వల్లే ప్రత్యేక హోదా డిమాండ్ ఈ అయిదేళ్ల పాటూ సజీవంగా ఉందనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమౌతున్నాయి. చివరికి- ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా యూటర్న్ తీసుకునేలా చేసింది. నాలుగున్నరేళ్ల పాటు ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తూ వచ్చిన చంద్రబాబు..తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా డిమాండ్ ను భుజానికెత్తుకునేలా చేసింది.
హోదా ఇస్తే.. ఏ పార్టీకైనా మద్దతు
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించే పార్టీ లేదా కూటమికి తాము మద్దతు ఇస్తామని వైఎస్ జగన్ ఎప్పుడో ప్రకటించారు. తమకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలే తప్ప రాజకీయ లబ్ది కాదంటూ అనేక సార్లు చెప్పారు. ఈ క్రమంలో- హోదాను ఇవ్వడం ద్వారా వైఎస్ జగన్ ను ఎన్డీయే కూటమిలో చేర్చుకోవాలనేది బీజేపీ నాయకుల వ్యూహంగా కనిపిస్తోంది.
లొసుగులను బూచిగా చూపిస్తారా?
హోదాను ఇవ్వడంతో పాటు ఒకరిద్దరు వైఎస్ఆర్సీపీ నాయకులపై ఉన్న ఆర్థిక నేరాలను కూడా బూచిగా చూపించడానికి అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నరసాపురం లోక్ సభ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు సుమారు 976 కోట్ల రూపాయల మేర బ్యాంకు డిఫాల్టర్ గా ఉన్నారని, ఆయనపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే- తమ కూటమికి మద్దతు ఇవ్వాలని బీజేపీ నాయకులు షరతులు విధించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.