ఆంధ్రప్రదేశ్లో YCPని టార్గెట్ చేసిన BJP?
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతాపార్టీ తన వ్యూహం మార్చింది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి ఆ స్థానంలోకి రావాలనుకున్న బీజేపీ అది నెరవేరకపోయేసరికి ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై దృష్టిసారించింది. కొంతమంది పార్టీ నేతలు ఇసుక, గనులు, మట్టి తదితర అక్రమాలకు మద్దతు పలుకుతుండటంతో వారిని లక్ష్యంగా ఎంచుకుంది.
ముఖ్యమంత్రి జగన్ మంచితనాన్ని అలుసుగా తీసుకున్న నేతలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచితనాన్ని అలుసుగా తీసుకున్న నేతలు నియోజకవర్గాల్లో చెలరేగిపోతున్నారు. ఇటువంటివారివల్లే పార్టీకి చెడ్డపేరు వస్తోందన్న అభిప్రాయం ఉంది. బీజేపీ కూడా ఈ తరహా నేతలపై దృష్టిసారించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈసారి అధికారం జిక్కించుకోవడమనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా అవసరం. అధికారం చేజారితే నేతలంతా బీజేపీవైపు చేజారిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం మారినప్పుడు టీడీపీలోకి వెళ్లలేరు కాబట్టి వీరందరికీ ప్రత్యామ్నాయంగా బీజేపీనే కనిపిస్తోంది.
పార్టీపై ప్రేమ ఉన్నట్లు నటించేవారే ఎక్కువ?
వైఎస్ జగన్కు సన్నిహితంగా ఉన్న నేతలు కూడా కేవలం పార్టీపై ప్రేమ ఉన్నట్లు కేవలం నటిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోతే రాజకీయంగా తమదారి తాము చూసుకునేవారిలో ఇలాంటివారే ముందువరుసలో ఉంటారని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. అటువంటి సమయం కోసమే బీజేపీ పెద్దలు కూడా ఎదురుచూస్తున్నారన్నది ఢిల్లీవర్గాల నుంచి వినిపిస్తోన్న మాట. అనుకున్న రీతిలో తెలుగుదేశం పార్టీ బలహీనపడకపోయేసరికి బీజేపీ వైసీపీపై దృష్టిసారించింది.
కేసుల కత్తి ఎత్తే అవకాశం?
రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కకుండా కేవలం 50 నుంచి 60 స్థానాలకే పరిమితమైతే మిగిలినవారిపై కేసుల కత్తి ఎత్తే అవకాశం ఉందని, దీనిద్వారా వారందరినీ బీజేపీవైపు తిప్పుకొని పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ను 2029 ఎన్నికలకు లక్ష్యంగా చేసుకుంది. భారతీయ జనతాపార్టీ ఢిల్లీ పెద్దలు చేసే అసలైన రాజకీయ క్రీడ 2024 ఎన్నికల తర్వాతే ప్రారంభమవుతుందని ఆ పార్టీ రాజకీయాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్న మాట. మనం కూడా ఆ క్రీడను చూడటానికి ఎంతో సమయం లేదుగా.. వేచిచూద్దాం.!!