సర్వే లెక్కలు: 'పొత్తు'పైనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేల భవితవ్యం..
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ చేపట్టిన సర్వేలో పలు రాజకీయ సమీకరణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సర్వేలో వెల్లడించిన విషయాలను పరిశీలిస్తే..
విశాఖపట్నం: ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ చేపట్టిన సర్వేలో పలు రాజకీయ సమీకరణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సర్వేలో వెల్లడించిన విషయాలను పరిశీలిస్తే.. ముఖ్యంగా పాయకరావు పేట టీడీపీ ఎమ్మెల్యే అనిత పరిస్థితి కాస్తంత విచిత్రంగానే ఉందనే చెప్పుకోవాలి. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఉమ్మడి పొత్తుతో గనుక పోటీ చేస్తే.. ఆ ఎఫెక్ట్ అనిత గెలుపుపై ప్రభావం చూపిస్తుందని సర్వేలో వెల్లడైంది.
పొత్తు పెట్టుకుంటే అనితకు పరాభవమే!:
బీజేపీ-టీడీపీ గనుక ఉమ్మడి పోరుకు దిగితే.. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాయకరావుపేటలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత ఓటమిపాలవడం ఖాయమని సర్వే తేల్చింది. ఉమ్మడి పోరుతో టీడీపీ-బీజేపీ కూటమికి 42.56శాతం ఓట్లు మాత్రమే అక్కడ పోల్ అయ్యే అవకాశం ఉందని, వైసీపీకి స్వల్ప ఆధిక్యంతో 42.79శాతం మంది మద్దతు పలికే అవకాశముందని సర్వే పేర్కొంది.
పొత్తు లేకపోతేనే అనితకు మేలు:
పొత్తు లేకుండా గనుక వచ్చే ఎన్నికల బరిలో దిగితే మాత్రం టీడీపీకి 48.25శాతం మంది మద్దతు పలుకుతారని, అప్పుడు వైసీపీ మద్దతుదారుల సంఖ్య 41.13కి పడిపోతుందని సర్వే ద్వారా వెల్లడైంది. బీజేపీకి కేవలం 6.5శాతం మంది మద్దతు మాత్రమే లభిస్తుందని తేలింది. అంటే, పొత్తు లేకుండా పోటీ చేస్తేనే టీడీపీ ఎమ్మెల్యే అనిత మరోసారి అసెంబ్లీలో అడుగుపెడుతారని సర్వే చెబుతోంది.
పొత్తుపైనే రాజు గారి భవితవ్యం :
ఇక విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరిస్థితి కూడా కాస్త విచిత్రంగానే ఉంది. ఉమ్మడి పోరుతో బరిలోకి దిగితేనే ఆయన గెలుస్తారని, లేనిపక్షంలో ఓటమి తప్పదని సర్వే చెబుతోంది. బీజేపీ ఒంటరి పోరు చేయాల్సి వస్తే.. వైసీపీకి పోల్ అయ్యే ఓట్లలో సగం ఓట్లు కూడా బీజేపీకి దక్కవని సర్వే పేర్కొంది. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో పొత్తు పైనే ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని సర్వే వెల్లడిస్తుంది.
పొత్తు కొనసాగుతుందా?
మొత్తానికి సర్వే ద్వారా భిన్నమైన సమీకరణాలు వ్యక్తమవుతుండడంతో.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ-టీడీపీ సయోధ్య ఇలాగే కొనసాగుతుందా? లేక ఈ బంధానికి తెరపడుతుందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో కలిసి నడవడం ద్వారా టీడీపీకి ఒరిగేదేమి ఉండదని సర్వే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో ఈ రెండు పార్టీల పయనం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.