బిజెపి స్వాగతం, నాడు మోడీ చెప్పాకేనా..: పవన్ కళ్యాణ్ తప్పటడుగు?
విజయవాడ: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను బిజెపి నేతలు తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బిజెపి ఏపీ యువమోర్చా నేత విష్ణువర్ధన్ రెడ్డి పవర్ స్టార్ను బిజెపిలోకి ఆహ్వానించారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని చెప్పారు.
బిజెపి, టిడిపి మధ్య స్నేహం గురించి మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో అవి తెగిపోయాయని అభిప్రాయపడ్డారు. కేవలం రాష్ట్ర, జాతీయస్థాయిలో మాత్రం కొనసాగుతోందని చెప్పారు. అది కూడా ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేమని అన్నారు.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించి.. ఆ తర్వాత టిడిపి - బిజెపి కూటమికి మద్దతిచ్చారు. ఇటీవల మాట్లాడుతూ... మంచి వ్యక్తి ప్రధాని కావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీకి మద్దతు పలికానని చెప్పారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర విషయం తెలుస్తోంది.

జనసేనను స్థాపించిన తర్వాత.. మోడీకి మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్... నరేంద్రుడి సూచన మేరకే చంద్రబాబుకు ఓకే చెప్పారట! బిజెపికి మద్దతు పలికిన పవన్.. టిడిపి-బిజెపి కూటమిగా ఉన్నందున.. మోడీకి మద్దతు పలికిన అతను తప్పనిసరిగా చంద్రబాబుకు మద్దతు పలకారనే వాదనలు అప్పుడే వినిపించాయి.
పవన్ కళ్యాణ్ తప్పటడుగులు!
పవన్ కళ్యాణ్ రాజకీయాల విషయంలో కొన్ని తప్పటడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014లోనే రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. 2019లో పోటీ చేస్తానని చెప్పడం, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తానో చెప్పలేనని అనడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే ఏపీ రాజధాని, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, కేంద్రం నుంచి రావాల్సిన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రశ్నించక పోవడం కూడా రాజకీయపరమైన తప్పేనని అంటున్నారు. అయితే, బిజెపి పైన నమ్మకం వల్లే పవన్ ధైర్యంగా ఉన్నారనే వాదనలు కూడా లేకపోలేదు.












Click it and Unblock the Notifications