బాబుకు చేయిచ్చారు: టిడిపి-బిజెపి మధ్య బడ్జెట్ చిచ్చు, మధ్యలో దూరిన జగన్!
విజయవాడ: రైల్వే, సాధారణ బడ్జెట్లో ఏపీకి సరైన నిధులు రాకపోవడంపై ఏపీలోని మిత్రపక్షాలు బిజెపి, టిడిపిల మధ్య వాగ్యుద్ధానికి కారణమవుతున్నాయి. టిడిపి నేతలు కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, చంద్రబాబు తీరే నిధులు రాకపోవడానికి కారణమని బిజెపి నేతలు చెబుతున్నారు.
చంద్రబాబు మంగళవారం ఉదయం మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని, అయితే ఏపీకి నిధులు తెస్తామని చెప్పారు. సోమవారం అయితే.. బడ్జెట్ను చూసి కళ్ల వెంబడి నీళ్లు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
మంత్రులు, ఇతర టిడిపి నేతలు కేంద్ర బడ్జెట్ పైన పెదవి విరుస్తున్నారు. అంతకుముందు రైల్వే బడ్జెట్లో, తాజా సాధారణ బడ్జెట్లో సరైన కేటాయింపులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బిజెపి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు.

కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత పురంధేశ్వరి మాట్లాడుతూ... ఏపీకి బిజెపి అన్యాయం చేయదని, పోలవరంకు కేవలం రూ.100 కోట్లు రావడానికి ఏపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. దీనిపై టిడిపి నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. రైల్వే, సాదారణ బడ్జెట్ కేటాయింపులు మిత్రపక్షాలైన టిడిపి, బిజెపిల మధ్య చిచ్చు పెట్టాయి.
మరోవైపు, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ విషయంలో టిడిపి, బిజెపిలను తప్పుపడుతోంది. అయితే, టిడిపి పైనే ఒకింత ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు చేతకానితనం వల్లనే నిధులు రాలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పురంధేశ్వరే చెప్పారని అంటున్నారు.












Click it and Unblock the Notifications