ఏపీలో బ్లాక్ ఫంగస్: ఒక్కో రోగికి 3 లక్షల ఖర్చు, 15వేల ఆంఫోటెరిసిన్ బీ వయల్స్కు సర్కారు ఆర్డర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలోనే మరో కొత్త ముప్పు బ్లాక్ ఫంగస్ కూడా కరోనా నుంచి కోలుకున్నవారిపై దాడి చేస్తోంది. ఇప్పటికే పలువురు ఈ బ్లాక్ ఫంగస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ బారినపడిన రోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఔషధాల కొనుగోలు సిద్ధమైంది.

బ్లాక్ ఫంగస్: 35వేల ఆంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ల వయల్స్ ఆర్డర్
బ్లాక్ ఫంగ్ లేదా మ్యూకోర్మికోసిస్ బారినపడిన వారికి వైద్య చికిత్సలో ఉపయోగించే ఔషధాలైన ఆంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లు 15,000 వయల్స్ను కొనగోలు చేసేందుకు ఇప్పటికే ఆర్డర్ పెట్టింది. ఈ మేరకు వివరాలను ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సింఘాల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 1650 వయల్స్ కేటాయిచిందని, అయితే, అవి రాష్ట్ర అవసరాలకు సరిపోవనే ఉద్దేశంతో రాష్ట్రం ప్రభుత్వం కూడా 15,000 వయల్స్ కొనుగోలుకు మూడు కంపెనీలకు ఆర్డర్ పెట్టిందని చెప్పారు. మే 22 లేదా మే23న ఈ వయల్స్ సరఫరా ప్రారంభమవుతుందని చెప్పారు.

ఒక్కో బ్లాక్ ఫంగస్ రోగికి రూ. 3 లక్షల ఖర్చు
అవసరమైతే మరిన్ని వయల్స్ కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏకే సింఘాల్ స్పస్టం చేశారు. ఒక బ్లాక్ ఫంగస్ రోగికి 60 వయల్స్ అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారని, ఈ కారణంగా ఒక రోగి పూర్తి వైద్యానికి సుమారు రూ. 3 లక్షలు ఖర్చవుతుందని సింఘాల్ తెలిపారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చిందని సింఘాల్ చెప్పారు.

బ్లాక్ ఫంగస్ కాటేస్తే తీవ్ర పరిణామాలు
కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. పర్యావరణంలోని శిలీంధ్ర బీజాంశాలతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ప్రజలు మ్యూకోమైకోసిస్ బారినపడుతున్నారు. కట్, స్క్రాప్, బర్న్ లేదా ఇతర రకాల చర్మ గాయం ద్వారా ఫంగస్ చర్మంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఇది చర్మంపై అభివృద్ధి చెందుతుంది. కోవిడ్ -19 నుంచి కోలుకుంటున్న లేదా కోలుకున్న రోగులలో ఈ వ్యాధి కనుగొనబడింది. అంతేగాక, డయాబెటిస్ ఉన్నవారు, రోగనిరోధక శక్తి సరిగ్గా పనిచేయని ఎవరైనా ఈ వ్యాధి పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, బ్లాక్ ఫంగస్ కారణంగా కొందరు కంటిచూపు కోల్పోవడం, ముఖ భాగంలో ఉబ్బడం లాంటి తీవ్ర పరిణామాలుంటున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి ప్రాణాలను తీస్తోందీ ఫంగస్.

ఏపీలో వైద్య పరిస్థితి మెరుగుపడింది..
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద బ్యాంకులో రూ. 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లలను గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగుపడ్డాయని, వైద్య శాఖ 24 గంటలూ పనిచేస్తోందని తెలిపారు. ఇక కేంద్రం కూడా రాష్ట్రానికి కేటాయించిన 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాను 625 మెట్రిక్ టన్నులకు పెంచిందని తెలిపారు. కాగా, ఏపీలో గత కొద్ది రోజులుగా ఏపీలో కొత్తగా 20వేలకుపై కరోనా కేసులు, 100కు పైగా మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications