తెలుగులోనే బోర్డులు ఉండాలి...లేదంటే వేలల్లో జరిమానా:ఎపి ప్రభుత్వం నిర్ణయం
Recommended Video
అమరావతి:రాష్ట్రంలోని వ్యాపార సంస్థలు, వాణిజ్య దుకాణాల బోర్డులను ఇకపై తప్పనిసరిగా తెలుగులో రాయాలన్న నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తోంది.
దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఈ నిబంధనకు సంబంధించిన ఆదేశాలు చాలాకాలం క్రిందటే జారీ అయినా క్షేత్ర స్థాయిలో అది అమలుకు నోచుకోవడం లేదు. ఈ క్రమంలో నిబంధనలను మరింత కఠినతరం చేసి, జరిమానాను కూడా భారీగా పెంచి తాజా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇకపై బోర్డులు తెలుగులోనే ఉండాలన్న నిబంధనను ఉల్లంఘించిన వారిపై కనీసం రూ. 3000 రూపాయలు జరిమానాను విధించనున్నారు. గతంలో ఈ జరిమానా 500 రూపాయలు మాత్రమే ఉండేది. అయితే దుకాణదారులు ఈ నిబంధనను ఏమాత్రం ఖాతరు చేయకపోతుండటం, యధేచ్ఛగా ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో కార్మికశాఖ ఈ నిబంధనలను మరింత కఠినతరం చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.
ఇందుకు సంబంధించిన ఫైలు ను ఇప్పటికే ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపడం జరిగిందని కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. దుకాణదారులు నిబంధనను ఉల్లంఘించి జరిమానా కట్టిన తరువాత కూడా వారిలో మార్పు రాకపోతే వారిపై మరింత కఠిన చర్యల తీసుకోవడం గురించి కూడా మార్గదర్శకాలను తాజా ఉత్తర్వుల్లో పొందుపరిచినట్లు కార్మిక శాఖా మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు.
అలాగే త్వరలో అన్ని రకాల నామఫలకాలు, శిలాఫలకాల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తెలుగు వినియోగించాలని, లేకుంటే రూ. 10వేలు జరిమానా తప్పదనే నిబంధనలు కూడా రానున్నట్లు తెలిసింది. ఆయా నిబంధనల మేరకు తెలుగుతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపని ప్రభుత్వ శాఖలకు సైతం రూ. 5 వేలు అపరాధ రుసుం విధించే విషయంగా కచ్చితంగా అమలు జరిగేలా చూడనున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసే నిబంధనలకు అనుగుణంగా విద్యా సంస్థల నిర్వాహకులు తెలుగును బోధనాంశంగా అమలు చేయకపోతే జరిమానా,జైలు తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.