టార్గెట్ ఎవరు?: కోర్టు ఆవరణలో బాంబు పేలుడు, చింటూనా లేక మాజీ ఎమ్మెల్యేనా?
అమరావతి: చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు ఘటన గురువారం కలకలం సృష్టించింది. మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూను కోర్టుకు తీసుకొచ్చే సమయంలో ఈ బాంబు పేలుడు ఘటన సంభవించడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ పేలుడు ఘటనలో ఓ లాయర్ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్న బాలాజీ అనే వ్యక్తి కాలికి తీవ్ర గాయమవగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మూడు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మేయర్ దంపతుల హత్య కేసులో విచారణలో భాగంగా చింటూను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చే సమయంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. మరోవైపు ఇదే రోజు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కూడా ఓ కేసు నిమిత్తం మరికాసేపట్లో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరిని టార్గెట్ చేసుకుని కోర్టు ఆవరణలో బాంబు పెట్టారనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు లాయర్ దుస్తుల్లో ఎవరైనా వచ్చి ఈ బాంబుని పేల్చారా? లేక కక్షిదారులే ఈ బాంబుని పేల్చారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ ఘటన నేపథ్యంలో కోర్టులో భారీగా పోలీసుల మోహరించారు. బాంబు స్వ్వాడ్ తనిఖీలు నిర్వహించారు. పేలని బాంబులను బాంబు స్వ్వాడ్ సిబ్బంది నిర్వీర్యం చేశారు. నల్ల ప్లాస్టిక్ కవర్లో బాంబు పేలినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బాంబు పేలుడు తీవ్రత నాటు బాంబు కంటే కొంచెం ఎక్కువ మోతాదులో ఉంది.
ఒక్కమాటలో చెప్పాలంటే చిన్నపాటి మందుపాతర విస్ఫోటనం లాగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శనివారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఈ బాంబు పేలడం పెద్ద కలకలం సృష్టించింది. పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.