విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై బోండా ఉమ ఫైర్, ప్లేటు ఫిరాయించిన విష్ణు!
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ మండిపడ్డారు. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, అవి ఆయన వ్యక్తిగతమని ఉమ పేర్కొన్నారు.
అమరావతి: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ మండిపడ్డారు. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, అవి ఆయన వ్యక్తిగతమని ఉమ పేర్కొన్నారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మంత్రులుగా ఉన్న వారంతా రాజీనామా చేయాలని, లేకపోతే పార్టీ ఫిరాయించిన వారు మంత్రులు కావచ్చని చట్టం తేవాలంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ మండిపడ్డారు. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే ముందు ఆయా ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను స్పీకర్ కు సమర్పించారని తెలిపారు.
విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలకు ఆస్కారం లేదని బోండా ఉమ చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశామని, స్పీకర్ ఆమోదిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమంటూ ఆ ఎమ్మెల్యేలు చెప్పిన విషయాన్ని బోండా ఉమ ప్రస్తావించారు.
ప్లేటు మార్చిన విష్ణుకుమార్ రాజు...
ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరి మంత్రులుగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్లేట్ ఫిరాయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వొద్దన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పుకొచ్చారు.
అంతకుముందు వైసీపీ నేత, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు.. వైపీసీ నుంచి టీడీపీలో చేరి మంత్రి పదవులు అనుభవించడం దారుణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి.
వెంటనే తేరుకున్న విష్ణుకుమార్ రాజు తన మాట మార్చారు. ఇది నైతిక విలువలకు సంబంధించినదని, ఇదే విషయాన్ని సీఎంకు, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి చెబుతానన్నారు. తన వ్యాఖ్యలు ఇంతచర్చకు దారితీస్తాయని అనుకోలేదని, ఈ మాత్రానికే మిత్రపక్షాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని తాను అనుకోవడం లేదని ఆయన చెప్పారు.
వైసీఎల్పీ ఆఫీసులో మీడియా సమావేశం యాదృచ్ఛికంగా జరిగిందన్న విష్ణుకుమార్ రాజు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఫిరాయింపులను సమర్ధించబోనన్నారు. తన ప్రకటనల్లో స్థిరత్వం లేదంటే ఒప్పుకోనని అన్నారు. పీఏసీ సమావేశంలో పట్టిసీమ నిర్మాణాన్ని సమర్ధించానని చెప్పిన విష్ణు.. వైసీపీ వాదనను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు.












Click it and Unblock the Notifications