వైఎస్ దేవుడు, జగన్ రాక్షసుడా?: ముద్రగడ వ్యాఖ్యలపై బొండా ఉమ
అమరావతి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం మాకు లేదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై బొండా ఉమ తీవ్రంగా స్పందించారు.
కాపులను అడ్డుపెట్టుకుని ముద్రగడ తన పబ్బం గడుపుకోవాలని చూస్తూ, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ తనకు దేవుడని చెప్పే ముద్రగడ, జగన్తో తనకు సంబంధం లేదని చెప్పడం దారుణమన్నారు. అంటే తండ్రి దేవుడు, కొడుకు రాక్షసుడా? అని అన్నారు.
వైయస్ని దేవుడన్నప్పుడే ముద్రగడ అంతరాత్మ అర్ధమవుతుందని అన్నారు. ముద్రగడ దీక్ష వెనుక ఖచ్చితంగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఉన్నారని చెప్పుకొచ్చారు. ముద్రగడను అడ్డుపెట్టుకొని వైయస్ జగన్ లభ్ది పొందాలనుకుంటున్నారని ఆరోపించారు.

ఈసారి ముద్రగడీ దీక్ష చేసినా ప్రభుత్వం పట్టించుకోదన్నారు. తమ ప్రభుత్వం కాపులకు న్యాయం చేస్తోందని, ముద్రగడకు కాదని అన్నారు. తన జీవితంలో ఏ పార్టీ పదవులు ఇచ్చిందో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ఒక్క టీడీపీ మాత్రమే ఆయనకు మంత్రి పదవులు ఇచ్చిందని అన్నారు.
టీడీపీ పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా అత్యున్నత పదవులిచ్చిందని అన్నారు. ముద్రగడ వెనుక జగన్ ఉన్నారని అర్ధమైందన్నారు. ముద్రగడ పద్మనాభం కాపుల కోసం కాపు జాతి కోసం అంటూ మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదన్నారు. 1995లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారని గుర్తు చేశారు.
ఆ సమయంలో మీకు కాపు నేతలు గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కాంగ్రెస్ను ఎందుకు నిలదీయలేదని అన్నారు. ప్రభుత్వం చేస్తానని ముందుకొచ్చిందన్నారు. కాపుల కోసం బీసీ కార్పోరేషన్ లాంటి వాటిని ఏర్పాటు చేస్తే కావాలనే ప్రభుత్వంపై ముద్రగడ విషం కక్కుతున్నారని మండిపడ్డారు.
ముద్రగడ వెనుక కచ్ఛితంగా జగన్ ఉన్నాడని, ఆయన మాటల్లోనే తేలిపోయిందని అన్నారు. ఎవరి ప్రయోజనాల కోసమో కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని బొండా ఉమ హితవు పలికారు.












Click it and Unblock the Notifications