పురంధేశ్వరికి అవగాహన లేదు: రాజకీయ నిరుద్యోగం వల్లేనన్న బొండా ఉమా
అమరావతి: మాజీ మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదాపై పురంధేశ్వరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆమె రాజకీయ నిరుద్యోగం వల్లే గందరగోళంలో ఉన్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని డీపీఆర్లపై పురంధేశ్వరి వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని బొండా ఉమా డిమాండ్ చేశారు.
తుని విధ్వంసం ఘటనలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాత్ర కేవలం సభ వరకే పరిమితమని చెప్పిన బొండా ఉమా తుని ఘటనకు వైసీపీ నేత భూమనే కారణమని ఆరోపించారు. ఇదిలా ఉంటే బుధవారం ఏపీకి హోదాపై ఇచ్చిన హామీని ఎందుకు మరచిపోతున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ఆమె సూటిగా సమాధానం చెప్పలేక పోయారు.

హోదాపై తిరుపతిలో నాడు ప్రకటన చేయలేదా? ఆర్థిక సంఘం సిఫార్సులతోనే మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ఇచ్చారా? ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది? విశాఖపట్నానికి ఇవ్వాల్సిన రైల్వే జోన్ను విజయవాడకు ఎందుకు తరలిస్తున్నారు? ఎంత సెంటిమెంట్ ఉంటే మేమిలా మిమ్మల్ని అడుగుతాం? ప్రజల తరఫునే ఈ ప్రశ్నలు వేస్తున్నామని విలేకరులు అడిగారు.
దానికి పురంధేశ్వరి.. నవ్వుతూనే తప్పించుకునే ప్రయత్నం చేశారు. తనకూ హోదాపై సెంటిమెంట్ ఉందని, ప్రజలను ఆందోళనపరిచే రాతలు, వ్యాఖ్యలు వద్దని, హోదా అన్న పదం లేకుండా అందుకు సమానమైన న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని ఆమె చెప్పారు.
14వ ఆర్థిక సంఘం నిబంధనల వల్లే హోదా అనే పదం ఉపయోగించలేకపోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఏపీకి న్యాయం చేసేందుకే అన్ని విధాల కృషి చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications