'చంద్రబాబు ప్రభుత్వానికి అవినీతి మరకలు అంటించడమే జగన్ లక్ష్యం'
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైయస్ జగన్పై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలూ అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి అవినీతి మరకలు అంటించడమే లక్ష్యంగా వైయస్ జగన్ పెట్టుకున్నారని అన్నారు.
అసెంబ్లీలో ఆయన పార్టీ సభా సమయాన్ని వృథా చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంపై అవిశ్వాసం, రోజా అంశం తప్ప ఆయనకు మరేమీ ప్రజా సమస్యలు గుర్తుకు రావడం లేదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని పక్కన బెట్టబోమని, అమరావతిలో ప్రజా రాజధానిని నిర్మించి తీరుతామని చెప్పారు.
వైయస్ జగన్ను ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారని, ఆయన వైఖరితో ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడతారని అన్నారు. ఇలా పార్టీ నుంచి అందరూ ఎమ్మెల్యేలు వీడితా ఆయనొక్కడే ఏకాకిగా మిగిలిపోతారని బొండా ఉమ జోస్యం చెప్పారు.
ఏపీ ముఖచిత్రం మారుతుంది: మంత్రి దేవినేని
భారీ యంత్రాలతో పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తయితే ఏపీ ముఖచిత్రం మారుతుందని అన్నారు.
ఈ సందర్భంగా 2018 నాటికి పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని మంత్రి దేవినేని స్పష్టం చేశారు. పూర్తయిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు పోలవరం అథారిటీకి తెలియజేస్తున్నట్లు చెప్పారు.