ఏపీలో మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి..
Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గన్నవరం మాజీ శాసన సభ్యుడు వల్లభనేని వంశీ అరెస్టు.. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీన్ని వైఎస్ఆర్సీపీ తప్పుపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనుసరిస్తోన్న డైవర్షన్ పాలిటిక్స్గా అభివర్ణిస్తోంది.
దీనిపై తాజాగా మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ ఉదయం ఆయన విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. అలా అక్రమ కేసు పెట్టి వల్లభనేని వంశీని అరెస్టు చేసిందని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నా, పాలన ఇప్పటికీ గాడిలో పడట్లేదని, వాటిపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలు ఏమిటంటూ ధ్వజమెత్తారు. హామీల అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, అందుకే- డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీసిందని బొత్స అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒక్క మేలు కూడా జరగలేదని పేర్కొన్నారు.
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కట్లేదు. నిత్యవసర ధరలు పెరిగిపోయాయి. అన్ని పన్నులు, విద్యుత్ చార్జీల పెంపు రూపంలో ప్రజల మీద భారం మోపుతున్నారు. ఇంకా ఎండాకాలం రాకపోయినా పవర్ కట్లు మొదలయయ్యాయి.. వీటన్నింటిని నుంచి తప్పించుకోవడానికే ఇలా కక్షసాధింపు చర్యలకు దిగిందని బొత్స చెప్పారు.
మా ప్రభుత్వంలో అవినీతి, భూ ఆక్రమణలు జరిగాయని టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. రకరకాల కమిటీలు, విచారణలు చేయిస్తోన్నారు. ఏ ఒక్కటీ తేల్చలేకపోయారు. మళ్లీ రిపోర్టులు తెప్పిస్తామంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతోందా? అనే అనుమానం కలుగుతోంది..అని అన్నారు బొత్స.
ఇంగ్లీష్ మీడియం ఎత్తేయడానికి ప్రభుత్వ బడుల్లో పిల్లలు తగ్గిపోయారని తప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ విమర్శించారు బొత్స సత్యనారాయణ. ఐబీ సిలబస్కి మంగళం పాడేశారని, నాడు- నేడు పనులు కూడా ఎక్కడా సాగట్లేదని చెప్పారు. డిజిటల్ క్లాస్ రూమ్లు, గోరు ముద్ద, అమ్మ ఒడి పథకం మాయం అయ్యాయని, విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.
ఒక్కో శాఖలో 7,000 నుంచి 10,000 ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని స్వయంగా చంద్రబాబే చెబుతున్నాడని దీన్ని బట్టి చూస్తే పాలన విఫలమైనట్టేనని బొత్స పేర్కొన్నారు. అధికారులు, మంత్రుల మధ్య సమన్వయం లేదని చంద్రబాబు మాటలతో అర్థమౌతోందని అన్నారు. మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి విచ్చలవిడిగా రేట్లు పెంచేస్తోన్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications