చెన్నైలోని వారిని ఆదుకోండి: బొత్స, జగన్ను కాదు.. జుకర్ ఆదర్శం: బాబు
హైదరాబాద్: చెన్నైలో చిక్కుకున్న తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షించాలని వైసిపి నేత బొత్స సత్యనారాయణ గురువారం నాడు డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులతో ఓ కమిటీ వేసి చెన్నైకి పంపించాలన్నారు. రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మకం చేయాలన్నారు.
ఇసుక తవ్వకాల పైన బొత్స తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపికి అవకాశముంటే పంచభూతాలను కబ్జా చేస్తారని ధ్వజమెత్తారు. పద్దెనిమిది నెలల్లో ఇసుక పేరుతో వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఎంత అవినీతిని ఎండగట్టారని ప్రశ్నించారు.
ఇసుక రీచ్ల ద్వారా రూ.850 కోట్లు వచ్చాయని చెబుతున్నారని, అలా అయితే మిగతా డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.40గా ఉన్న క్యూబిక్ మీటర్ ధరను రూ.550కి పెంచినా ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు రావటం లేదని నిలదీశారు.
తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంటే పంచభూతాలను కబ్జా చేస్తుందన్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పారు. ఇసుక అమ్మకాలలో వెయ్యి కోట్లు దోపిడీకి గురయ్యాయని చెప్పారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తారా అని నిలదీశారు.
ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అన్నారు. ఇసుక అమ్మకాలతో రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చెప్పారన్నారు. ఇప్పుడు కేవలం రూ.850 కోట్లు మాత్రమే వచ్చాయని చెబుతున్నారన్నారు. విశాఖలో తమ పార్టీ నేతల అరెస్టును ఖండిస్తున్నామన్నారు.
జగన్ను కాకుండా జుకర్ బర్గ్ను ఆదర్శంగా తీసుకోవాలి: బాబు
అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టిడిపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి టిడిపి కార్యకర్త నుంచి మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు ఏడువేల మందితోచంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎవరికీ ఇబ్బందుల్లోకుండా కాపులను బిసీల్లో చేరుస్తామని చెప్పారు. జగన్ లాంటి వారిని కాకుండా జుకర్ బర్గ్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.