ఏయ్ ఏయ్ ఏంటది.. మీరు మంత్రి: బొత్స, పెళ్లికాకుండా కాపురమంటే చెప్పుతో: ఉండవల్లి
హైదరాబాద్/ఢిల్లీ: ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి అసభ్యంగా మాట్లాడుతున్నారని, ఏయ్.. ఏయ్ అంటూ ఏమిటా మాటలు.. మీరు మంత్రి అని గుర్తుంచుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ బుధవారం అన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రిపై ఆయన మండిపడ్డారు.
కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి అసభ్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఆ మంత్రి వీధి రౌడీలా మాట్లాడుతున్నారన్నారు. ఆయన మాటలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ధైర్యముంటే ఆ మంత్రి ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలన్నారు.
మంత్రికి ధైర్యముంటే ప్రజల్లోకి వెళ్లాలన్నారు. కొత్తమాజేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని తాము నిన్న ధర్నా చేశామన్నారు. రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ సరికాదన్నారు. బలవంతపు భూసేకరణ సరికాదని నేడు జగన్ ధర్నా చేశారన్నారు.
మచిలీపట్నం, సిఆర్డీఏ ప్రాంతంలో జరిగిన ధర్నాలు విజయవంతమయ్యాయని చెప్పారు. తమ ధర్నాలు విజయవంతం కావడంతో టిడిపి అసహనంలో ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చారని, కానీ రోజుకో మాట మాట్లాడేందుకు కాదన్నారు.
అభివృద్ధికి జగన్ అడ్డుపడుతున్నట్లు చెప్పడం సరికాదన్నారు. పోలవరాన్ని జగన్ అడ్డుకుంటున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని, దానిపై ఆధారాలు చూపించాలన్నారు. రాజద్రోహానికి పాల్పడితే ఎంతటి వారైనా సహించమని ఓ మంత్రి అంటున్నారని, ఎవరు రాజద్రోహానికి పాల్పడ్డారో చెప్పాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజద్రోహానికి పాల్పడింది టిడిపినే అన్నారు. 'ఏయ్.. ఏయ్.. ఏమిటి ఈ మాటలు.. మీరు మంత్రి' అని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలను టిడిపి చీటింగ్ చేస్తోందన్నారు. ప్రజలను మోసం చేస్తున్న టిడిపి పైన ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలన్నారు. ప్రజా సమస్యల పైన పోరాడే హక్కు తమకు ఉందన్నారు.
పెళ్లి కాకుండా కాపురం చేయమన్నట్లుంది: ఉండవల్లి
హామీ మేరకు ప్రత్యేక హోదాను ప్రకటించకుండా, అంతే మొత్తంలో ప్యాకేజీ ఇస్తామని చెప్పడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సెటైరుల వేశారు. నిశ్చితార్థం చేసుకున్న తర్వాత, మాకు పెళ్లి అచ్చిరాదు, అమ్మాయిని కాపురానికి పంపండి, పెళ్లైతే ఏం సౌకర్యాలుంటాయో అన్నీ ఇస్తామని, అలానే చూసుకుంటామంటే ఊరుకుంటారా? చెప్పు తీసుకొని కొడతారని, ఈ ప్యాకేజీ కూడా అటువంటిదేనని దుయ్యబట్టారు.
విభజన బిల్లు సమయంలో ఒకమాట మాట్లాడిన తెలుగుదేశం నేతలు, నేడు బీజేపీతో ఉన్న అవసరాలను తీర్చుకునేందుకు మరో మాట మాట్లాడుతున్నారన్నారు. అసలు ప్రత్యేక హోదా పేరు చెప్పే టిడిపి - బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును, పరువు ప్రతిష్ఠలనూ బాబు సర్కారు బీజేపీ కాళ్ల ముందు తాకట్టు పెట్టిందన్నారు.