బాబూ!నీ పేరూ, ఎన్టీఆర్ పేరు పెట్టుకో!!: బొత్స ఫైర్
హైదరాబాద్: హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మార్చాలని, దానికి ఎన్టీ రామారావు పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన సూచనను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చాలా అని ఆయన గురువార మీడియా ప్రతినిధుల వద్ద ప్రశ్నించారు.
రాజీవ్ గాంధీ పేరుతో ఉన్న శంషాబాద్ విమానాశ్రంయానికి ఎన్టీఆర్ పేరు పెడుతామని అనడం సరి కాదని, ఇలా అయితే ప్రతి ఐదేళ్లకోసారి పేర్లు మార్చాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించే విమానాశ్రయాలకు చంద్రబాబు తన పేరును, ఎన్టీ రామారావు పేరును పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు రాబట్టాలని, విరాళాల పేరుతో చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని బొత్స అన్నారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పెట్టాలని, కొత్తగా వచ్చే మూడు విమానాశ్రయాలకు కూడా పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు.
పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్పై రాద్ధాంతం చేయడం సరి కాదని ఆయన అన్నారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలాపాలన్నది యుపిఎ ప్రభుత్వ నిర్ణయమని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
పోలవరం అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని ఆయన అన్నారు. ఐదు కోట్ల సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించినా తెలంగాణ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు భరోసా కల్పించేందుకు బదులు కాంగ్రెసు పార్టీని లక్ష్యం చేసుకోవడానికే పరిమితమైందని ఆయన అన్నారు.
సహించం: విహెచ్
శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్చాలనే చంద్రబాబు చర్య మంచిది కాదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నేత వి. హనుమంతరావు అన్నారు. పేర్లు మార్చే సంప్రదాయం మంచిది కాదని ఆయన గురువారం మీడియాతో అన్నారు. తమ మనోభావాలను దెబ్బ తీయవద్దని, పేరు మారిస్తే తాము సహించబోమని ఆయన అన్నారు.