ఎందుకు అడగలేదు: వెంకయ్యకు బొత్స ప్రశ్న
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను విభజన బిల్లులో చేర్చాలని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అప్పుడే ఎందుకు అడగలేదని,కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన బిజెపి నాయకులు ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక కుంటిసాకులు చెబుతూ ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెబుతున్నారని, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు అప్పుడు ఎంపిగా ఉన్న వెంకయ్య ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించ లేదని ప్రశ్నించారు. పైగా అప్పటి యుపిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపాదిస్తే, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను పదేళ్లు అమలు చేస్తామని బీరాలు పలికారని విమర్శించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా సాధ్యంకాదనే విధంగా మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీకి పరిమితం కావాలనే విధంగా మాట్లాడటం ముఖ్యమంత్రి హోదాకు తగదని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని, లక్షల కోట్ల రూపాయలు కేంద్రంనుంచి తీసుకువస్తామని చెప్పిన మాటలు ఉత్తవేనని తేలిపోయిందని అన్నారు.
అగ్రిగోల్డ్ యాజమాన్యంతో బాబు లాలూచీ
అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సన్నిహితులు లాలూచీపడిన కారణంగానే ఈ వ్యవహారంలో నిందితులను అరెస్ట్ చేయటం లేదని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విజయనగరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే అగ్రిగోల్డ్ వ్యవహారంలో సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరాలని డిమాండ్ చేసారు.
దగాకు, వంచనకు మారుపేరు చంద్రబాబు అని, అధికారం కోసం దేనికైనా ఒడి గడతారని విమర్శించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో వేలకోట్ల రూపాయలు నష్టపోయిన బాధితులు ఆదుకోవాలంటూ ఆందోళనలకు దిగితే నిర్వాహకుల నుంచి బాధితుల డిపాజిట్లను ముక్కుపిండి వసూలు చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి మాటలు కార్యరూపం దాల్చటం లేదన్నారు.
అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ముఖ్యమంత్రి, ఆయన తాబేదారులు లాలూచీ పడిన కారణంగానే తక్షణ చర్యలు తీసుకోవటం లేదని, సిబిసిఐడి విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే అగ్రిగోల్డ్ నిర్వాహకులను 24గంటల్లో అరెస్ట్ చేయాలని, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితుల డిపాజిట్లు చెల్లించాలని డిమాండ్ చేసారు.
ఆర్టీసి సమ్మెపై నిర్లక్ష్యం
సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే, వీరి సమస్యలను సకాలంలో పరిష్కరించవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బొత్స విమర్సించారు. తమ హయాంలో 26శాతం ఐఆర్ చెల్లించటంతోపాటు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చాక, అదేస్థాయిలో వేతన సవరణ జరుపుతామని నోటిమాటగా అంగీకారానికి వచ్చామని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వేతన సవరణ విషయంలో ఉదాసీనతగా వ్యవహరించిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications